ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ సర్కారు సీరియస్.. సీడబ్ల్యూసీకి లేఖ !!
తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ అంశం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిపై తెలంగాణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు మళ్లించడమే లక్ష్యంగా పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు కింద పోలవరం జలాశయం నుంచి సోమశిల.. గలేరు-నాగార్జునసాగర్ వరకు నీటిని మళ్లించనున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రకారం ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని నీటి కొరతను తీర్చడం, సాగు నీటి అందుబాటును పెంచడం, తాగునీటి అవసరాలను తీర్చడమే లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు.
కానీ తెలంగాణ అభిప్రాయం ప్రకారం ఈ ప్రాజెక్టు అమలు జరిగితే తెలంగాణ జలహక్కులు ఉల్లంఘించబడతాయి, కృష్ణా నదిలో రాష్ట్రానికి ఉన్న నియంత్రణ దెబ్బతింటుందని వాదనలు వినిపిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం పోలవరం డీపీఆర్లో బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ప్రస్తావన లేదని.. ఇది పూర్తిగా కొత్త ప్రతిపాదన అంటూ చెప్పుకొస్తుంది. అందుకు గాను కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి ఆమోదం ఇవ్వకూడదని చెబుతున్నారు.

అయితే ఇటీవలే ఏపీ ప్రభుత్వం కొత్త టెండర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్పై తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా టెండర్ను రద్దు చేయాలని సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. ఆ లేఖలో.. బనకచర్ల టెండర్, సర్వే నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఆమోదించవద్దని కోరింది. పోలవరం డీపీఆర్కు విరుద్ధంగా ఈ టెండర్ ఉందని తెలంగాణ ఆరోపించింది.
ఇప్పటికే తెలంగాణ జలశక్తి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దీన్ని అడ్డుకుంటామని తెలిపారు. ఈ పరిస్థితుల్లో గతంలో కృష్ణా, గోదావరి నదులపై వున్న వివాదాల కంటే, ఇప్పుడు బనకచర్ల మరో కీలక మలుపుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications