టీ ప్రభుత్వం సహకరించడం లేదు: గంటా, ఎపికే డిఎస్సీ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా సహకరించడం లేదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు విమర్శించారు. ఇంటర్మీడియట్ ఉమ్మడి పరీక్షల కోసం తెలంగాణ ప్రభుత్వం అంగీకరించకుండా ఏకపక్షంగా తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రంలో పరీక్షల షెడ్యూల్ ప్రకటించడాన్ని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తప్పు పట్టారు.
చిట్ట చివరి క్షణం వరకు ఇంటర్మీడియట్ ఉమ్మడి పరీక్షల నిర్వహణ కోసం ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ అమలకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి చెప్పారు. పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కలిసి రాలేదని ఆయన అన్నారు. పాత పద్ధతి ప్రకారమే డిఎస్సీ నిర్వహిస్తామని ఆయన అన్నారు. స్థానిక, స్థానికేతర వివాదం పరిష్కారానికి కమిటీ వేసినట్లు మంత్రి తెలిపారు.
కాగా, రాజభవన్లో గవర్నర్ నరసింహన్తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మ భేటీ అయ్యారు. వారితో ఇంటర్మీడియట్ పరీక్షల వివాదంపైనే కాకుండా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృత సమస్యలపై చర్చించారు. డిఎస్సీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలకే పరిమితం చేయనున్నారు. ఆయా జిల్లాల్లోని అభ్యర్థులే దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

దాదాపు పది వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, డీఎస్సీ భర్తీ ప్రక్రియలో 20 శాతం ఓపెన్ కోటాకు ఎవరు అర్హులన్న సందిగ్ధం తెరపైకి వచ్చింది. దీనికి జీఏడీ తెరదించింది. పాత పద్ధతినే పాటించాలంటూ విద్యా శాఖకు మంగళవారం ఆదేశాలిచ్చింది. గతంలో డీఎస్సీలు నిర్వహించినప్పుడు ఏ పద్ధతిని పాటించారో ఇప్పుడు కూడా దానినే అనుసరించాలని స్పష్టం చేసింది.
దీంతో ‘టెట్ కమ్ టీఆర్టీ' నోటిఫికేషన్లో ఇదే విషయాన్ని పొందుపరిచారు.
దీని ప్రకారం ఖాళీ పోస్టులున్న సొంత జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల అభ్యర్థులు నాన్ లోకల్ అభ్యర్థులవుతారు. సొంత జిల్లాకు చెందిన లోకల్ అభ్యర్థులు 80 శాతం పోస్టులకు అర్హులవుతారు. మిగిలిన 20 శాతం పోస్టులకు మాత్రం 13 (లోకల్, నాన్ లోకల్ కలిపి) జిల్లాల అభ్యర్థులు అర్హులవుతారు. అలాగే, తెలంగాణలో నిర్వహించే డీఎస్సీలో కూడా అక్కడి పది జిల్లాల అభ్యర్థులే 20 శాతం ఓపెన్ కోటా పోస్టులకు అర్హులవుతారు.












Click it and Unblock the Notifications