గోదావరి వరద: పోలవరంపై ఏపీ ప్రభుత్వానికి తెలంగాణా లేఖ!!
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా ఎగువన భారీ వర్షాలు కురవడంతో గోదావరి నదికి భారీగా వరద నీరు చేరుకుంటుంది. గోదావరి నుండి వెళ్తున్న వరద నీటి ప్రభావంతో పోలవరం వద్ద ఉధృతి బాగా పెరిగింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది.
భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తున్న నేపథ్యంలో స్పిల్ వే గేట్లను పూర్తిగా తెరిచి ఉంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. గోదావరి కి వరద ముంచెత్తడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని పూర్తిస్థాయి అధ్యయనం చేసే వరకు నీటిని నిలువ చేయొద్దని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.

పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం పట్టణంతో పాటు పలు గ్రామాలకు ముంపు ప్రమాదం ఉందని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖలో పేర్కొంది. తెలంగాణలోని ప్రాంతాలకు ముంపు ప్రమాదం ఉన్న కారణంగా గోదావరి నుండి పోలవరం వస్తున్న వరదను వచ్చినట్టే వదిలేయాలని, నీటిని నిల్వ చేయొద్దని కోరింది.
పోలవరం 48 గేట్లు, స్లూయిజ్ లను తెరిచే ఉంచాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. 2022 జూలైలో వచ్చిన వరదల్లో పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం ప్రాంతం ముంపుకు గురైందని లేఖలో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బ్యాక్ వాటర్ ప్రభావిత ప్రాంతాలలో రక్షణ చర్యలు తీసుకునే వరకు గోదావరి వరద ప్రవాహాన్ని పూర్తిగా దిగువకు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం తన లేఖలో కోరింది.
రివర్స్ క్రాస్ సెక్షన్లను కొత్తగా సర్వే చేయించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని కోరింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ తో పాటు కేంద్ర జల సంఘానికి కూడా ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తాము ఈ విజ్ఞప్తిని చేస్తున్నామని లేఖ ద్వారా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications