నిన్న నాగ్, నేడు ఏపీఎన్జీవోలకు కేసీఆర్ ఝలక్ (ఫోటో)
హైదరాబాద్: ప్రభుత్వం కేటాయించి, నిరుపయోగంగా ఉన్న భూములను వెనక్కి తీసుకుంటామన్న తెలంగాణ సర్కార్.. ఆ మేరకు నడుం బిగించింది. ఏపీఎన్జీవో సంఘానికి కేటాయించిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో వెనక్కి తీసుకుంది. నోటీసులిచ్చినా సొసైటీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆగమేఘాలపై చర్యలు చేపట్టింది. గురువారం స్వాధీనం చేసుకుని సర్కారు స్థలమంటూ బోర్డులు పాతింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లిలోని సర్వేనంబరు 36, 37లోని 189.11 ఎకరాల భూమిని ప్రభుత్వం 2005లో ఏపీఎన్జీవోల హౌసింగ్ సొసైటీకి కేటాయించింది. ఈ భూముల్లో ఇప్పటి వరకు నిర్మాణాలు చేపట్టకపోవడంతో పాటు, సొసైటీ సభ్యులెవరో కూడా ఇంత వరకు తేల్చకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
ఈ భూములను వెనక్కి తీసుకునే విషయమై బుధవారం రాత్రి రెవెన్యూ ముఖ్య అధికారులు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయంకల్లా ఫైలుపై సంతకం చేసిన రెవెన్యూమంత్రి మహమూద్ అలీ, సీఎం కేసీఆర్కు పంపించారు. ఆ వెంటనే సీఎం కూడా ఆమోదించారు. వాస్తవానికి 1994లో ప్రభుత్వ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీల కోసం గోపన్నపల్లి, గచ్చిబౌలిలోని 477 ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వం సేకరించింది.
ఇందులో 50 ఎకరాలు గచ్చిబౌలి రెవెన్యూ పరిధిలో ఉండగా, మిగతా భూమి గోపన్నపల్లి రెవెన్యూ పరిధిలో ఉంది. 2005 తరువాత ఈ భూములను ఏపీఎన్జీవో, టీఎన్జీవో హైకోర్టు ఉద్యోగుల సొసైటీ, సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీలకు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భాగంగా ఏపీఎన్జీవోలకు సర్వేనంబరు 36, 37లో గల 189.11 ఎకరాలను కేటాయించింది.
ఏపీఎన్జీవోలకు కేటాయించిన భూమిని రెవెన్యూ యంత్రాంగం స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారి. 2005 భూమిని సొసైటీకి కేటాయించిన ప్రభుత్వం.. ఈ భూమిని నిరుపయోగంగా ఉంచడంతో 2007లో అక్టోబర్ 31న వెనక్కి తీసుకుంది. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతూ సొసైటీ సభ్యులు కోరారు. అదే సమయంలో ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో అప్పీల్ చేశారు.
ఈ విషయమై పునరాలోచనలో పడిన ప్రభుత్వం తిరిగి సొసైటీ భూములను అప్పగించేందుకు నిర్ణయించడంతో సొసైటీ సభ్యులు హైకోర్టులో వేసిన పిటిషన్ను విరమించుకున్నారు. దీంతో 2008లో సర్కార్ మళ్లీ ఈ సొసైటీకి భూమిని కేటాయించింది. ఆ తర్వాతా ఈ భూములు అలాగే నిరుపయోగంగా ఉండడంతో, గతేడాది సెప్టెంబర్ 26న ప్రభుత్వం మరోసారి నోటీసు జారీ చేసింది.
కాగా, ఈ సొసైటీ ఇళ్ల స్థలాల వివాదంలో ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు, నేతలు గోపాల్రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు ఇచ్చిన స్థలాలు దక్కలేదని సొసైటీ సభ్యులు వేదప్రసాద్ వాపోయారు. దీని వల్ల రిటైరైన ఉద్యోగులు నష్టపోతారని, సీఎం మానవీయ కోణంలో ఆలోచించి సర్వీసు - సీనియారిటీ ప్రాతిపదికన ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు.