వైఎస్ జగన్ బెయిల్ రద్దు: రఘురామ పిటీషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జారీ చేసిన బెయిల్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటీషన్పై తెలంగాణ హైకోర్టులో ఇవ్వాళ వాదనలు ముగిశాయి. ఆస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దాన్ని రద్దు చేయాలంటూ వైఎస్ఆర్సీపీకే చెందిన తిరుగుబాటు నాయకుడు, లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటీషన్ ఇది.
ఒమిక్రాన్కు ఆనందయ్య మందు: పంపిణీ నిలిపివేయాలంటూ గ్రామస్తుల ధర్నా: కృష్ణపట్నంలో ఉద్రిక్తత
రఘురామ కృష్ణంరాజు తరఫున ప్రముఖ న్యాయవాది వెంకటేశ్ తన వాదనలను వినిపించారు. ఆస్తుల కేసులో బెయిల్పై ఉన్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ ఆయన న్యాయస్థానం ముందు వాదించారు. తన అభిప్రాయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో ఆయనకు నోటీసులు ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. బెయిల్ రద్దు పిటిషన్పై తన వైఖరిని స్పష్టం చేయాలని సీబీఐ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.
సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వైఎస్ జగన్కు బెయిల్ను మంజూరు చేసే విషయంలో తన తీర్పును ఇదివరకే వినిపించిందని, ఆ తరువాత పరిస్థితిలో ఎలాంటి మార్పులు లేవని సీబీఐ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. ఇరు వైపుల వాదనలను విన్న తరువాత హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. వైఎస్ జగన్తో పాటు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి బెయిల్ను కూడా రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణంరాజు ఈ పిటిషన్ దాఖలు చేశారు.
బెయిల్ రద్దు చేయాలంటూ ఆయన తొలుత సీబీఐ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ సాక్షులను ప్రభావితం చేస్తోన్నారంటూ ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి సాక్షులను ప్రలోభ పెడుతున్నారని, విచారణ ప్రక్రియను ఉద్దేశపూరకంగా అడ్డుకుంటున్నారని, సకాలంలో కౌంటర్లను దాఖలు చేయకుండా జాప్యం చేస్తున్నారంటూ ఇదివరకు రఘురామ కృష్ణంరాజు సీబీఐ న్యాయస్థానంలో వాదించారు.
ఆయన వాదనలతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఏకీభవించలేదు. అలాంటి పరిణామాలేవీ చోటు చేసుకోలేదని అభిప్రాయపడింది. సాక్షులను ప్రభావితం చేస్తోన్నారనడానికి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అప్పట్లో ఈ పిటీషన్ను కొట్టేసింది. దీనిపై రఘురామ కృష్ణంరాజు అప్పీల్కు వెళ్లారు. హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన సమయలో విధించిన షరతులను వైఎస్ జగన్, విజయసాయి రెడ్డి ఉల్లంఘించారని ఆరోపించారు.