గోల్కొండ కోటపై జెండా ఎగరేయనున్న సిఎం కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్వాతంత్ర్య వేడుకలను (ఆగస్టు15) ఇంతకు ముందు జరిగిన ఉత్సవాలకు భిన్నంగా గోల్కొండ కోట వద్ద నిర్వహించాలని నిర్ణయించారు. ఆ కోటపై మువ్వన్నెల జెండా ఎగురవేయనున్నట్లు ఇప్పటికే అధికారులకు తెలిపారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, డిజిపి అనురాగ్ శర్మలను సిఎం కెసిఆర్ ఆదేశించారు.
వేడుకల నిర్వహణలో భాగంగా.. తెలంగాణ చారిత్రక వైభవాన్ని, సంస్కృతిని ప్రతిబింబించేలా చేయాల్సిన ఏర్పాట్లపై రాష్ట్రంలోని మేధావుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సిఎస్, డిజిపి సోమవారం గోల్కొండ కోటను సందర్శించి భద్రతాపరమైన ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా అనే అంశంపై అధ్యయనం చేయనున్నారు.

ఇన్నాళ్లుగా ఆగస్టు 15న స్వాతంత్య్ర దిన వేడుకలను సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఈసారి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న తొలి స్వాతంత్ర దినోత్సవం కావడంతో.. వేడుకలకు మరింత వన్నె తెచ్చేందుకు, చరిత్రలో నిలిచిపోయేలా వాటిని ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్ం ఈ నిర్ణయం తీసుకుంది.
అంతేగాక, తెలంగాణ సంస్కృతిని, ఆచారాలను ప్రతిబింబించేలా పలు శకటాలను కూడా ఈ వేడుకల్లో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే బోనాల జాతరకు వేదికయిన గోల్కొండ కోట.. స్వాతంత్ర్య వేడుకలతో సరికొత్త శోభ సంతరించుకోనుంది.












Click it and Unblock the Notifications