జగన్ ప్రత్యర్ధులకు తెలంగాణ సురక్షితం కాదా ? కేసీఆర్ సాయంతో షాక్ లు-ఏం జరుగుతోంది?
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి, ఇంకా చెప్పాలంటే స్వయంగా సీఎం జగన్ కు రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న కొందరు కొంతకాలంగా తెలంగాణను సురక్షితమని భావిస్తున్నారు. అయితే అక్కడా వారికి కేసీఆర్ సర్కార్ చుక్కలు చూపిస్తోంది. దీంతో వారు ఏపీని వీడి తెలంగాణలో తలదాచుకున్నా ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో పైకి జగన్ తో విభేదాలు ఉన్నట్లు చెప్పుకుంటున్న కేసీఆర్ సర్కార్..అంతర్గతంగా మాత్రం ఏపీ సీఎంకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో జగన్ ఏపీ ప్రత్యర్ధులు
ఏపీలో వైసీపీతో, సీఎం జగన్ తో రాజకీయంగా విభేదిస్తున్న చాలామంది ప్రత్యర్ధులు మూడేళ్లుగా తెలంగాణలో ఆశ్రయం పొందుతున్నారు. వీరంతా ఏదో ఒక రకంగా జగన్ తో, వైసీపీతో విభేదించడమే కాకుండా వారిపై మాటల దాడి చేసిన వారే. దీంతో జగన్ అధికారంలోకి రాగానే వీరందరికీ చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో వారు ఒక్కొక్కరుగా తెలంగాణకు వెళ్లిపోయి ఆశ్రయం పొందుతూ, వ్యాపారాలు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఏపీలో తిరిగి మంచి రోజులు వచ్చాక తిరిగి వద్దామని భావిస్తున్నారు. అయితే ఆలోపే వారికి తెలంగాణలోనూ చుక్కలు కనిపిస్తున్నాయి.
జేసీ ప్రభాకర్ రెడ్డితో మొదలు
గతంలో టీడీపీ అధికారంలో ఉండగా వైఎస్ జగన్ పై తీవ్రంగా మాటల దాడి చేసిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి.. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. వరుస కేసులతో తెలంగాణ వెళ్లి తలదాచుకోవాల్సి వచ్చింది. అయితే తెలంగాణ వెళ్లినా వారికి ఊరట లభించలేదు. ఏపీ పోలీసులు వచ్చి వారిని అరెస్టు చేసి అనంతపురం జిల్లాకు తెచ్చారు. ఆ తర్వాత ఏపీలోనూ కేసులు పెట్టారు. దీంతో తెలంగాణలో ఉన్న వారు కాస్తా తిరిగి ఏపీకి వచ్చి కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్దితి.
రఘురామకృష్ణంరాజు
ఇదే కోవలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును కూడా రాజద్రోహం కేసులో ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లి గచ్చిబౌలిలోని ఆయన ఇంట్లో అరెస్టు చేసి ఏపీకి తెచ్చారు. ఆ తర్వాత సీఐడీ కస్టడీలో ఆయన్ను టార్చర్ పెట్టారు. చివరికి ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు కూడా నిర్దారించి బెయిల్ ఇచ్చింది.
తాజాగా మరోసారి ప్రధాని భీమవరం టూర్ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాల్లో ఏపీ కానిస్టేబుల్ ను నిర్బంధించి కొట్టారన్న ఫిర్యాదుతో మరోసారి రఘురామతోపాటు ఆయన భద్రతా సిబ్బందిని తెలంగాణ పోలీసులు టార్గెట్ చేశారు. దీంతో ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టుకు వెళ్లినా వైసీపీ రెబెల్ ఎంపీకి ఊరట దక్కలేదు.
చింతమనేని ప్రభాకర్
సరిగ్గా ఇలాంటిదే మరో కేసు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైనా నమోదైంది. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చాక పదుల సంఖ్యలో కేసులతో నిత్యం జైళ్లలోనే ఉంటున్న చింతమనేని.. బెయిల్ పై బయటికి వచ్చి తెలంగాణ వెళ్లిపోయారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు వెళ్లి కోడిపందాలు నిర్వహిస్తున్న ఆయనపై అక్కడి పోలీసులు కేసు నమోదుచేశారు.
ఆయన అక్కడ లేనని చెప్పడంతో వీడియో విడుదల చేశారు. దీంతో చింతమనేని చేసేది లేక ఏపీలోనే ఉన్నా కేసులు పెట్టుకోవచ్చని ప్రకటించారు. ఈ నేపథ్యంలో చింతమనేనిపై తెలంగాణపై కోడి పంందాల నిర్వహణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టబోతున్నారు. ఈ కేసులోనూ జగన్ కు రాజకీయ ప్రత్యర్ధి అయిన చింతమనేని ఇరుకునపడటం ఖాయంగా ఉంది.
జగన్ ప్రత్యర్ధులకు కేసీఆర్ షాక్ లు?
తాజా పరిణామాలు చూస్తుంటే జగన్ ప్రత్యర్ధులు తెలంగాణలో ఆశ్రయం పొందేందుకు కానీ, వ్యాపారాలు చేసుకునేందుకు కానీ, మరే ఇతర విధంగా ఉండేందుకు కానీ కేసీఆర్ ప్రభుత్వం ఇష్టపడటం లేదని తెలుస్తోంది.
పొరుగు రాష్ట్ర సీఎం జగన్ కు కోపం తెప్పించరాదనే లక్ష్యంతో కేసీఆర్ ఇలా చేస్తున్నారా లేక అక్కడ నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదు కానీ.. జగన్ ప్రత్యర్ధుల్ని కేసీఆర్ టార్గెట్ చేస్తున్న తీరు మాత్రం చర్చనీయాంశమవుతోంది. అంతేకాదు తెలంగాణ ఇకపై జగన్ ప్రత్యర్ధులకు సురక్షిత స్ధానం కాదని తేలిపోతోంది.