మూర్ఖుడే, శనిని వదిలించాలి: సిఎంపై టి నేతల ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు శాఖను మార్చడం పట్ల తెలంగాణ ప్రాంత నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబు శాఖను ముఖ్యమంత్రి కిరణ్ మార్చడం బాధాకరమని అన్నారు. సిఎం, సీమాంధ్ర నేతలు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఆగదని గుత్తా స్పష్టం చేశారు.
సిఎం ఓ మూర్ఖుడు: పొన్నం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమకు సిఎం కిరణ్ కుమార్ రెడ్డి మూర్ఖడనే విషయం ముందే తెలుసని చెప్పారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్చడంతో సిఎం కిరణ్ పిచ్చివాడనే విషయం రుజువైందని అన్నారు. సిఎం కిరణ్ తీరుపై గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

శనిని వదిలించాలి: జీవన్
రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు శాఖను మార్చడం తెలంగాణ ప్రజలను కించపర్చడమేనని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేసి, కాంగ్రెస్ కు పట్టిన శనిని వదిలించాలని డిమాండ్ చేశారు. శాఖను మార్చినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోలేరని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
అసెంబ్లీ సెషన్లో ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు శాఖను మార్చడం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూర్ఖత్వమేనని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. రాష్ట్రపతిని సిఎం కిరణ్ అగౌరవపరుస్తున్నారని విమర్శించారు. పార్లమెంటు ప్రత్యేక సెషన్ లో బిజెపి మద్దతుతో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని తెలిపారు. 2014లో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ శకం ఆరంభమవుతోందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications