ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు .. సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన తెలంగాణా ఎంపీ
తెలంగాణా రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల నగారా మోగింది .ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సత్తా చూపాలని ఇప్పటి నుండే పని మొదలుపెట్టింది. ఇక ఇదే సమయంలో మునిసిపల్ ఎన్నికలను వాయిదా వెయ్యాలని కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించింది. ఇక ఇదే సమయంలో మునిసిపల్ ఎన్నికల సమరానికి సిద్ధం అవుతూనే సీఎం కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు తెలంగాణా రాష్ట్ర ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి . అంతే కాదు సీఎం జగన్ కు కేసీఆర్ కు మధ్య తేడా కూడా చెప్తున్నారు .

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు . తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుండీ హామీల అమలుకు విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆరునెలల కాలంలో ఎన్నో హామీలను నెరవేర్చారని కితాబిచ్చారు. మొదటి సారి ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కష్టపడుతున్నారని చెప్పారు.

సీఎం జగన్ హామీలు నెరవేరుస్తున్నారు .. కేసీఆర్ మోసం చేస్తున్నారన్న ఎంపీ
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోనే సీఎం జగన్ ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తున్నాడని జగన్ పై పొగడ్తల వర్షం కురిపించిన కోమటిరెడ్డి కేసీఆర్ పై మాత్రం విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చినా ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చడం లేదని అన్నారు. ప్రజల బాగోగులు గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. అంతేకాదు కేసీఆర్ ఎన్నికల ముందు చెప్పిన రైతు రుణమాఫీ జరగలేదని పేర్కొన్నారు. రైతు బంధు గురించి ఊసే లేదని , నిరుద్యోగ భృతి భ్రమగా మారిందని కోమటిరెడ్డి విమర్శించారు.

కేసీఆర్ కు మానవత్వం లేదన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సీఎం కేసీఆర్మానవత్వం లేని మనిషని చెప్పిన కోమటిరెడ్డి పేద ప్రజలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు . మునిసిపల్ ఎన్నికల వేళ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరైనవని, ప్రత్యర్ధి పార్టీ కాంగ్రెస్ అని చెప్పిన కోమటిరెడ్డి ప్రజా సమస్యలు తీర్చడంలో టీఆర్ఎస్ విఫలమయ్యింది అంటూ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు.

తెలుగురాష్ట్రాలో ముఖ్యమంత్రుల పనితీరుపై పోలిక .. జగన్ కు పొగడ్తలు
ప్రశ్నించే గొంతుక ఉన్నప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు.అందుకోసం కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు ఇచ్చి సీఎం కేసీఆర్ అహంకారానికి తగిన బుద్ధి చెప్పాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో సీఎం జగన్ పాలనను , సీఎం కేసీఆర్ పాలనను పోల్చి చూస్తున్న తెలంగాణా రాజకీయ నాయకులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న పలు పాలనాపరమైన నిర్ణయాలను అభినందిస్తున్నారు. సీఎం కేసీఆర్ ను జగన్ ను చూపించి మరీ తిట్టిపోస్తున్నారు. ఇది సీఎం కేసీఆర్ కు ఒకింత ఇబ్బందికర పరిణామమే .












Click it and Unblock the Notifications