తెలంగాణను గెలిపించాలని కేసీఆర్, నో.. బాలకృష్ణకు బాబు షాక్!
హైదరాబాద్: తెలంగాణను గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం అన్నారు. నల్గొండ జిల్లా టీడీపీ నేత చిన్నప రెడ్డి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. పార్టీలో చిన్నప రెడ్డికి మంచి గుర్తింపు ఉంటుందని చెప్పారు. ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ సాధించుకున్న మనం.. ఇక బంగారు తెలంగాణ సాధించుకోవాల్సి ఉందన్నారు.
తెలంగాణ అభివృద్ధి కోసం అందరు కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఎన్నికలు వస్తాయి.. పోతాయని, ఎవరో గెలుస్తారు.. ఎవరో ఓడుతారని.. తెలంగాణ మాత్రం ముఖ్యమన్నారు. రాజకీయాలకు ఇది సమయం కాదని, ప్రపంచం ముందు తెలంగాణను గెలిపించాల్సిన అవసరముందన్నారు.
నల్గొండ జిల్లా సూర్యాపేట - కోదాడ డ్రై పోర్టు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నక్కలగండి ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. దామరచర్లలో 7500 మెగావాట్లతో విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని చెప్పారు. మునుగోడుకు ఫ్లోరైడ్ రహిత నీటిని అందిస్తామన్నారు. సాగర్ ఎడమ కాలువ కింద రెండో సాగు రైతుల ఘనత అన్నారు. నాగార్జున సాగర్ నుంచి మన వాటా నీళ్లు మనం పూర్తిగా వాడుకునే పరిస్థితి రావాలన్నారు.
రేవంత్ రెడ్డికి నాయిని హెచ్చరిక
తెలంగాణ టీడీపీ నేతలు తెలంగాణ నీళ్లు తాగుకుంటూ పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సలాం కొడుతున్నారని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ధ్వజమెత్తారు. చిన్నపరెడ్డి తెరాసలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో పుట్టగతులు ఉండవన్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ రెచ్చిపోతున్నారని, అందుకే కేసీఆర్ను విమర్శిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వంటి వారిని పిచ్చాసుపత్రికి పంపిస్తామన్నారు. చంద్రబాబు కీ ఇస్తే ఇక్కడి నేతలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.
టీడీపీ నేతలకు బుద్ధి రాలేదు: హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రం వచ్చినా తెలుగుదేశం పార్టీ నేతలకు మాత్రం బుద్ది రాలేదని మంత్రి హరీష్ రావు వేరుగా అన్నారు. జాతీయ గీతాలాపన సమయంలో అసెంబ్లీ సభలో బెంచీలు ఎక్కిన నేతలు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతికి ఏమని ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు.
పెద్ద అంబర్పేటకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు సోమవారం తెరాసలో చేరిన సమయంలో హరీష్ మాట్లాడారు. టీడీపీ నేతలు తమ పరువు తీసుకునేందుకు ఢిల్లీకి వెళ్తున్నారన్నారు. చిన్న పిల్లలు కూడా జాతీయ గీతం పాడుతుంటే అల్లరి చేయరన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఖరారు చేసిన చంద్రబాబు
ఎమ్మెల్యే కోటాలో ఎన్నుకునే ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను టీడీపీ సోమవారం ఖరారు చేసింది. అభ్యర్థుల పైన చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించి నిర్ణయించారు.
వీవీవీ చౌదరి (తూర్పు గోదావరి జిల్లా), తిప్పేస్వామి (అనంతపురం), గుమ్మడి సంధ్యారాణి (విజయనగరం) పేర్లను ఖరారు చేశారు. కాగా, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ సూచించిన పేర్లకు బాబు నో చెప్పారని తెలుస్తోంది. అబ్దుల్ ఘనీ, అంబికా కృష్ణల పేర్లు బాలయ్య సూచించినా వాటిని పరిగణలోకి తీసుకోలేదని అంటున్నారు.