ఏపీకి చంద్రబాబు: 2019 ఎలా.. తెలంగాణ టిడిపిలో కేటగిరీలు?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణను వదిలి, ఏపీ పైన దృష్టి సారిస్తున్నారు. తెలంగాణ బాధ్యతలు టిటిడిపి నేతలకు.. ముఖ్యంగా తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పైన పడింది.
ఇప్పటికే తెలంగాణలో టిడిపి ప్రాభవం కోల్పోయింది. ఈ నేపథ్యంలో పార్టీని పటిష్టపరిచేందుకు, పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తామే గెలుస్తామని చెబుతున్నారు. ఇప్పటికే 15 మంది ఎమ్మెల్యేలు గెలవగా 12 మంది కారు ఎక్కారు.
ఓ వైపు పార్టీ బలహీనపడటం, మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో పార్టీలో ఉండేవారు ఎందరు, పోయేవారు ఎందరు, పోటీ చేసేది ఎవరు.. అనే చర్చ ఇప్పుడే టిడిపిలో సాగుతోంది. దీనిని బట్టి కేటగిరీలు కూడా ఇచ్చారట.
పార్టీ తెలంగాణ అధ్యక్షులు రమణ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిల మధ్య పొంతన కుదరడం లేదనే వాదనలు ఉన్నాయి. పైగా కొందరు నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారంటున్నారు. ఈ నేపథ్యంలో కేటగిరీలుగా విభజించారని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేసేవాళ్లు ఓ కేటగిరీ, పోటీకి దూరంగా ఉండేవాళ్లను మరో కేటగిరీగా చేశారని తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయమేమంటే చంద్రబాబుతో ఎక్కువ సాన్నిహిత్యం ఉన్న నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీకి సుముఖంగా లేరని తెలుస్తోంది.
అవసరమైతే చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో వారు నామినేటెడ్ పోస్టులు దక్కించుకోవాలని భావిస్తున్నారట. తెలంగాణలో పార్టీ కార్యకలాపాలు కేవలం ఓ పదిపదిహేను మంది ముఖ్యుల ద్వారానే నడుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందులో కూడా చక్రం తిప్పేవారు కొందరే ఉన్నారట. ప్రధానంగా రేవంత్ పైన తెలంగాణ టిడిపి బాధ్యత ఉంది. ఆయన ఏ మేరకు నడిపిస్తారో చూడాలంటున్నారు.