కేసీఆర్పై టీడీపీ అవిశ్వాస అస్త్రం, బాబుపై శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం లేదా సభాపతి పైన అవిశ్వాసం పెట్టే యోచనలో ఉంది. కేసీఆర్ ప్రభుత్వం పైన అవిశ్వాసంన నోటీసు ఇవ్వాలని టీడీపీ యోచిస్తోంది. అసెంబ్లీలో అధికార పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేలను పని గట్టుకొని వేధిస్తోందని, మాట్లాడనీయకుండా అడ్డుపడుతోందని టీడీపీ అభిప్రాయపడుతోంది.
దీంతో అవిశ్వాసం ఆలోచన చేస్తోంది. తెలంగాణలో అధికార తెరాస పైన టీడీపీ రెండు అంశాల్లో తీవ్ర ఆగ్రహంతో ఉంది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడకుండా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు అడ్డుకొంటున్నారని, దీనిని సభాపతి కూడా నిరోధించలేకపోతున్నారని ఆరోపిస్తోంది.
బీఏసీ సమావేశానికి టీడీపీ నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరుకావడానికి మొదటి సమావేశంలో అంగీకరించి ఇప్పుడు నిరాకరిస్తున్నదని అంటోంది. ఈ అంశాలని సభాపతి దృష్టికి తీసుకు రావాలని చూస్తోంది. దాని పైన ఆయన ప్రతిస్పందించక పోతే అవిశ్వాసం నోటీసు ఇవ్వాలని చూస్తోంది.
ప్రభుత్వం పైన అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు పదోవంతు మంది సభ్యులు ఉండాలి. తెలుగుదేశం పార్టీకి ఆ బలం ఉంది. టీడీపీ ఇచ్చిన అవిశ్వాసం నోటీసు సభ ఆమోదం పొందితే.. దాని పైన చర్చించేందుకు సమావేశాలను పొడిగించడమో లేక ప్రత్యేక సమావేశాలు నిర్వహించడమో చేయాల్సి ఉంటుంది.
ఓర్వలేకపోతున్నారు: శ్రీనివాస్ గౌడ్
కాగా ప్రభుత్వం పైన లేదా స్పీకర్ పైన టీడీపీ అవిశ్వాసం ఇవ్వవచ్చుననే వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. స్పీకర్ పైన అవిశ్వాసం ఇస్తే బీసీలంతా ఏకమవుతారన్నారు. బీసీ స్పీకర్గా ఉండడాన్ని చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. బీసీల పైన ప్రేమ ఉంటే కృష్ణయ్యను ఎల్పీ నేతగా ఎందుకు చేయలేదన్నారు.
చంద్రబాబు తెలంగాణలో అలజడి సృష్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు పాల్పడుతున్నారన్నారు. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన చంద్రబాబు బీసీ వ్యక్తిని కనీసం ఫ్లోర్ లీడర్ కూడా చేయలేదన్నారు.