"త్యాగయ్య" అవార్డు కోసం పోటీపడుతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్ నెలలో జరగాలి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే వాటికి బలం చేకూరే సంఘటనలు చోటుచేసుకోలేదు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఒక విషయాన్ని వెల్లడించారు. 2023 మేలోకానీ, 2023 డిసెంబరులోకానీ ముందస్తు రావడానికి అవకాశం ఉందని తేల్చారు.

ముందుగానే సిద్ధమైన చంద్రబాబు
ముందస్తుకు సంబంధించి చంద్రబాబు మొదటి నుంచి ఒక వ్యూహంతో పనిచేసుకుంటూ వస్తున్నారు. తెలుగుదేశం-జనసేన మధ్య పొత్తు దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఏ నియోజకవర్గాలు జనసేనకు కేటాయిస్తారనే సందేహం తెలుగు తమ్ముళ్లను వెంటాడుతోంది. వీటిపై చంద్రబాబు పూర్తిస్థాయి స్పష్టతతో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలున్నప్పటికీ బలమైన నాయకులు లేరు. బలమైన నాయకుడు లేనిచోట ఆ పార్టీ కూడా తనకు సీటు కేటాయించాలని పట్టుబట్టే అవకాశం లేదు. తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్త లక్ష్యం వైసీపీకి చెక్ పెట్టడమే కావడంతో ఒకరికొకరు త్యాగం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు.

బలమైన నాయకులున్నచోట ఏం చేయాలి?
రాష్ట్రం మొత్తంమీద జనసేనకు ఏ నియోజకవర్గాలు కేటాయించాలి? ఏ నియోజకవర్గంలో ఆ పార్టీకి బలం ఉంది? అక్కడ సామాజికవర్గాల ప్రాబల్యం ఎలా ఉంటుంది? గతంలో అక్కడ ఏ పార్టీ గెలిచింది? తాను నిర్వహింపచేసుకున్న సర్వేలో ఎవరికి అనుకూలంగా ఉంది?... తదితర విషయాలన్నింటినీ చంద్రబాబు క్రోడీకరించుకొని ఒక జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జనసేనకు కేటాయించాలనుకుంటున్న నియోజకవర్గాల్లో ఆయన ముందు నుంచి బలమైన ఇన్ ఛార్జిలను నియమించలేదు. ఒకవేళ జనసేన ఒత్తిడితో బలమైన నాయకులున్నచోట నియోజకవర్గాన్ని కేటాయించాల్సి వస్తే ఆ నాయకుడికి నామినేటెడ్ పదవి ఇచ్చేలా నచ్చచెప్పబోతున్నారు.

ఓట్ల బదిలీపై ప్రత్యేక దృష్టి!
గతంలో టీడీపీ పొత్తులు పెట్టుకున్న సందర్భాల్లో సీట్లు కేటాయించినప్పటికీ మిత్రపక్షాల నుంచి అనుకున్నంతస్థాయిలో ఓట్ల బదిలీ జరగలేదు. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇరుపార్టీల అధినేతలు ఓట్ల బదిలీపై దృష్టిపెట్టారు. జనసేన నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి జనసేనకు అనుకున్నస్థాయిలో బదిలీ జరిగితే వైసీపీని ఓడించడం సులభమవుతుందని, అందుకే పొత్తు కుదిరిన నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. పొత్తులవల్ల మున్ముందు ఈ రెండు పార్టీలు ఇంకా ఎంత తమను తాము తగ్గించుకుంటాయో చూడాల్సి ఉంది.!!












Click it and Unblock the Notifications