ప్రత్యేక హోదా: దేవుడికి, మోడీకి మాత్రమే తెలుసు: జేసీ
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చే విషయం ఇద్దరికే తెలుసు అని అనంతపురం ఎంపీ (తెలుగుదేశం) జేసీ. దివాకర్ రెడ్డి అన్నారు. పైన ఉన్న ఆ దేవుడికి, భారత ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రం ఆవిషయం కచ్చితంగా తెలుసు అని చెప్పారు.
శనివారం జేసీ. దివాకర్ రెడ్డి అనంతపురంలో విలేకరులతో తనదైన శైలిలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు ప్రత్యేక హోదా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఇదే సందర్బంలో చెప్పారు.
అయితే ప్రత్యేక హోదా వస్తుందో ? లేదో ? అని కచ్చితంగా ఇద్దరు మాత్రమే చెప్పగలరని అన్నారు. దేవుడు మాత్రం మనకు చెప్పలేడు కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ చెబుతారని అన్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ లబ్ది చేకూరుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామి ఇచ్చారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కలిసిన విషయం తెలిసిందే. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు మోడీని కలిశారు. ఈ నేపధ్యంలో విలేకరుల ప్రత్యేక హోదా వస్తుందా ? అని ప్రశ్నించగా జేసీ ఈ విధంగా స్పందించారు.