మధ్యలో వచ్చినవారిని పార్టీలో చేర్చుకుంటే ఇట్టాగే ఉంటది 'బాబుగారూ'!!
వచ్చే ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు తెలుగుదేశానికి జీవన్మరణ సమస్య లాంటివి. గెలిచినవారే నిలుస్తారు. అందుకు తగ్గట్లుగా ఇప్పటి నుంచే వ్యూహాలను ఇరుపార్టీలు సిద్ధం చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ పదే పదే పిలుపునిస్తున్నప్పటికీ నాయకులెవరూ స్పందించడంలేదు.
తిరిగి గెలిచింది గొట్టిపాటి ఒక్కరే..
ప్రజల్లో మమేకమవడంద్వారానే గెలవగలమని వారికి చెబుతున్నప్పటికీ మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు మాత్రం కదులుతున్నారు.. పోరుబాట పడుతున్నారు. 2017-18 కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు రాగా.. వారిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడమేకాదు.. కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. వారిలో గత ఎన్నికల్లో అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ ఒక్కరే మళ్లీ విజయం సాధించారు. మిగతావారంతా ఓటమిపాలయ్యారు. పార్టీలోకి చేర్చుకోవడంతోపాటు.. మంత్రి పదవులివ్వడంతోపాటు.. ఎన్నికల్లో పోటీచేయడానికి సీట్లిచ్చినప్పటికీ వారి నుంచి ఇప్పుడు బాబుకు నిరాశే ఎదురవుతోంది. పార్టీ తరఫున ప్రజావాణిని వినిపించడానికి సిద్ధమవడంలేదు.
పాదయాత్ర కమిటీల్లో వీరి పేర్లుంచాలని..
పోనీ వీరంతా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలేమైనా చేస్తున్నారా? ప్రజా ఉద్యమాలు చేస్తున్నారా? అంటే అదీ లేదు. ఏ నాయకుడు బయటకు రావడంలేదు. వారంతా బయటకు వస్తే ప్రభుత్వం నుంచి షాక్ తప్పదనే సంకేతాలు వెళుతుండటంతో అందరూ సైలెంటయ్యారంటూ తెలుగుదేశం పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడున్నర సంవత్సరాల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇప్పటి నుంచి యాక్టివ్ అవమంటే మౌనమే సమాధానమవుతోంది. జనవరి 27 నుంచి పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాబోతోంది. జిల్లాలవారీగా ఈయనకు సహకరించేందుకు పార్టీ కమిటీలు వేస్తోంది. ఆ కమిటీల్లో వైసీపీ నుంచి వచ్చిన 23 మందిని కూడా ఉంచాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనిపై పార్టీలో చర్చ కూడా జరిగింది.
ఎలాంటి బాధ్యతలు వద్దు..
తమకు ఎలాంటి బాధ్యతలు వద్దని, కావాలంటే ఖర్చులు పెట్టుకుంటామని వీరంతా అధినేతకు చెబుతున్నారు. అంటే పాదయాత్రలో పాల్గొనేది లేదని పరోక్షంగా చెబుతున్నారు. దీంతో చంద్రబాబు ఆ నేతలపై ఫైరైనట్లు తెలుస్తోంది. ఎన్నాళ్లు అలా భయపడుతూ కూర్చుంటారని, ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒకరోజు ప్రజల్లోకి రావాల్సిందేనని, వెంటనే జనజీవన స్రవంతిలో కలవండంటూ చంద్రబాబు గట్టిగా ఆదేశాలు జారీచేశారు. తాము బయటకు రావడంవల్ల ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరుగుతుదని, చివరకు టీడీపీనే ఇబ్బంది పడే పరిస్థితికి చేరుకుంటుందని అధినేతకు చెబుతున్నారు. చివరకు ఏం చేస్తారో చూద్దాం.