హత్య చేసి..ప్రభుత్వ లాంఛనాలా: అధికారిక అంత్యక్రియలను వద్దంటోన్న టీడీపీ!
Recommended Video
గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి కాస్సేపట్లో అంతిమయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆయన భౌతిక కాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించడానికి వచ్చిన రెవెన్యూ అధికారులు, పోలీసులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కోడెలను ప్రభుత్వమే హత్య చేసిందంటూ ఆరోపిస్తోన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించడానికి వీల్లేదంటూ పట్టుబట్టారు. రెవెన్యూ అధికారులు వారిని నచ్చజెప్పడానికి ప్రయత్నించినప్పటికీ.. వినిపించుకోొలేదు.
ఒంటిగంట తరువాత అంత్యక్రియలు..
పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాాదాలు చేయడంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోడెల భౌతిక కాయానికి బుధవారం మధ్యాహ్నం నరసరావు పేటలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. మరి కొద్దిసేపట్లో అంతిమయాత్ర ఆరంభం కానుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కడసారి చూపు కోసం కోడెల భౌతిక దేహాన్ని ఆయన నివాసంలో ఉంచారు. ఉదయం 11 గంటల తరువాత అంతిమయాత్ర ఆరంభం అవుతుంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నరసరావుపేట స్మశాన వాటికలో అంతిమ సంస్కారాన్ని నిర్వహించనున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ హత్యేనంటోన్న కార్యకర్తలు..
ఆ ఏర్పాట్ల కోసం జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకోగా.. కోడెల అభిమానులు, టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తమ నాయకుడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ వేధింపులేనని ఆరోపిస్తున్నారు. అంతిమ యాత్ర సందర్భంగా నరసరావుపేటలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని జిల్లా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు అమల్లో ఉండేలా 144 సెక్షన్ ను విధించారు. కోడెల నివాసం వద్ద సుమారు 500 మందికి పైగా పోలీసులను మోహరింపజేశారు. చివరిసారి చూపు కోసం వందలాది మంది టీడీపీ అభిమానులు, కార్యకర్తలు కోడెల నివాసానికి చేరుకుంటున్నారు.
పేటలో వేడెక్కిన వాతావరణం..
గుంటూరు రూరల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆర్ జయలక్ష్మి నరసరావుపేటలో మకాం వేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆమె సమీక్షిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని ఆమె పోలీసులకు సూచించారు. నరసరావుపేట పట్టణంలో వాతావరణం వేడెక్కింది. కాస్సేపట్లో కోడెల భౌతిక కాయానికి అంతిమ యాత్ర ఆరంభం కాబోతుండటంతో పట్టణంలో ఎటు చూసినా టీడీపీ కార్యకర్తలు, పోలీసులు కనిపిస్తున్నారు. ఎప్పుడేం జరురుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నట్లు ఉంది. అవాంఛనీయ సంఘటలు చోటు చేసుకోకుండా ఉండటానికి జిల్లా పోలీసు యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే 144 సెక్షన్ ను విధించింది.