దాసరి సినిమాల వల్లే ఎన్టీఆర్ సీఎంగా!, రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు
దాసరి నారాయణరావు తన నలభై ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాల్ని చూశారు. చరిత్రలో నిలిచిపోయే భారీ బ్లాక్ బస్టర్లను అందించారు.
హైదరాబాద్: దాసరి నారాయణరావు తన నలభై ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాల్ని చూశారు. చరిత్రలో నిలిచిపోయే భారీ బ్లాక్ బస్టర్లను అందించారు. ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారక రామారావుతో ఆయన చేసిన బొబ్బిలి పులి, సర్దార్ పాపరాయుడులాంటి సినిమాలే ఎన్టీఆర్ సీఎం కావడంలో కీలకపాత్ర పోషించాయంటారు.
అలాగే అక్కినేని నాగేశ్వర రావు హీరోగా ఆయన తెరకెక్కించిన మేఘసందేశం సినిమా భారీ విజయం సాధించటంతోపాటు ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించబడింది. ఆయన కమర్షియల్ సినిమాలతో పాటు అనేక సందేశాత్మక చిత్రాలు తీశారు.
అద్భుత, వ్యంగ్యాస్త్ర చిత్రాలు
ఒసేయ్ రాములమ్మ చిత్రం విజయశాంతినే మార్చేసింది. ఒరేయ్ రిక్షా, ఒసేయ్ రాములమ్మ వంటి సినిమాలతో సమాజంలోని సమస్యలను ఎత్తి చూపించారు.. మేస్త్రీ, ఎమ్మెల్యే ఏడుకొండలులాంటి సినిమాలతో రాజకీయాలపై వ్యంగ్యాస్త్రం సంధించారు.
దక్షిణాది భాషల్లో
దాదాపు తెలుగు ఇండస్ట్రీలోని అందరు ప్రముఖ నటులతో సినిమాలు చేశారు. మామగారు, మేస్త్రీలాంటి సినిమాలకు ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నారు. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ దాసరి సత్తా చాటారు. దాదాపు దక్షిణాది భాషలన్నింటితోపాటు హిందీలోనూ సినిమాలను తెరకెక్కించారు.
వెండితెర చీకటి కోణాలు
వెండితెర వెనుక చీకటి కోణాల్ని అద్దాల మేడ, శివరంజని సినిమాలతో ప్రపంచానికి తెలిసేలా చేశారు. అనంతరం బుల్లితెర మీద కూడా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. విశ్వమిత్ర అనే హిందీ సిరీయల్తో బుల్లితెర దర్శకుడిగా కూడా మారారు. ఆయన నిర్మాణ సంస్థ ద్వారా అనేక సీరియల్స్ నిర్మించారు.
సమస్యలపై పోరాటం
సినీరంగంలో మంచి స్థానంలో ఉండగానే కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా తరువాత కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. తెలుగు సినీ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేశారు.
మరో విషయమేమంటే దర్శకుడికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని పరిచయం చేసిన తొలి దర్శకుడు దాసరే. ఆయన కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో ఆయనకు పద్దెనిమిదివేల అభిమానుల సంఘాలు ఉండేవి.