అసెంబ్లీ సీట్ల పెంపు ఆలస్యం!: ఫిరాయింపులతో 2019లో టీడీపీ తలనొప్పేనా?
హైదరాబాద్: ఏపీలో టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రంలో విపక్షాన్ని లేకుండా చేసే ఉద్దేశంతో అధికార పార్టీ 'ఆపరేషన్ ఆకర్ష్' కు తెరలేపింది. పార్టీలోకి వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవద్దంటూ అధికార పార్టీకి చెందిన ఆయా నియోజక వర్గాల్లోని కార్యకర్తలు పలు సందర్భాల్లో వ్యతిరేకించారు.
అయితే వ్యతిరేకించిన ఆయా నియోజక వర్గ నేతలకు, కార్యకర్తలకు పార్టీ అధిష్టానం చెప్పిన మాట 2019 నాటికి ఏపీలో అసెంబ్లీ నియోజక వర్గాల పెంపు ఉంటుందని, అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పడంతో వారు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకునేందుకు అంగీకరించడం మనం చూశాం.
అయితే తాజాగా సమాచారం ప్రకారం 2019 నాటికి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు కష్టమేనని అంటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కేంద్రం కసరత్తు ప్రారంభించినా కొన్ని ఇబ్బందులు తలెత్తినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఏపీలో 225, తెలంగాణలో 153నియోజకవర్గాల పెంపుపై ఎలా ముందుకెళ్లాలో తెలపాలంటూ కేంద్ర న్యాయశాఖకు నోడల్ ఏజెన్సీ అయిన హోంశాఖ ఒక ఫైల్ పంపింది.
దీనిపై కేంద్ర అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తెలుసుకున్న తరువాత న్యాయశాఖ సవరణ బిల్లును తయారు చేసి హోంశాఖకు పంపుతుందని ఆ శాఖకు చెందిన సీనియర్ అధికారులు తెలిపారు. న్యాయశాఖ నుంచి బిల్లు అందిన తర్వాత కేంద్ర మంత్రివర్గం ఆమోదానికి పంపి, వెంటనే పార్లమెంటులో ప్రవేశపెడతామని కూడా హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.
2019 నాటికి ఏపీ, తెలంగాణల్లో కొత్త నియోజకవర్గాలు ఏర్పడాలంటే పునర్విభజన జరగాల్సిన అవసరం ఉందని, అందుకు తగిన సమయం కావాల్సి ఉన్నందున వీలైనంత త్వరగానే సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు.
దీనికి సంబంధించి ఇటీవల హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, న్యాయశాఖమంత్రి సదానందగౌడలతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఏపీ విభజన చట్టంలో అవసరం మేరకు నియోజకవర్గాలను పెంచుకోవచ్చని పేర్కొన్నప్పటికీ 2026 వరకూ నియోజకవర్గాల పునర్విభజన కుదరదంటూ ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది.
ఆర్టికల్ 170 క్లాజ్ 3 ప్రకారం 2026 తర్వాత అందుబాటులోకి వచ్చే మొదటి జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేయగలమని, ఈలోగా చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనంటూ కేంద్ర ఎన్నికల కమిషన్, న్యాయశాఖ స్పష్టం చేశాయి.
దీంతో రాజ్యాంగ సవరణ అనేది కష్టమైన పని కాబట్టి ఏపీ విభజన చట్టం-2016లోని సెక్షన్ 26కు సవరణ చేస్తే సరిపోతుందని న్యాయనిపుణులు సూచించారు. ఆర్టికల్ 170తో సంబంధం లేకుండా అన్న పదాన్ని సెక్షన్ 26లో చేర్చితే తెలుగు రాష్ర్టాల్లో నియోజకవర్గాల పెంపునకు మార్గం సుగమం అవుతుందని హోంశాఖ భావిస్తోంది.
అయితే ఈ మేరకు బిల్లును తయారు చేసి పంపాల్సిందిగా హోంశాఖ నుంచి పంపిన ఫైల్లో న్యాయశాఖను కోరినట్లు తెలిసింది. అయితే ఈ ప్రక్రియ ఎప్పటికీ ముగుస్తుందో... ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సభలో ఎప్పుడు ప్రవేశపెడుతుందో చాడాలి మరి. ఇలా 2019 నాటికి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు కొలిక్కి రాకపోతే తాజా ఫిరాయింపులతో రాజకీయ పార్టీలు సీట్ల పంపకాలపై ఇబ్బందులు పడాల్సిందే.