తమిళనాట తెలుగు విద్యార్థులపై ఒత్తిడి!: కెసిఆర్-బాబు స్పందించాలి
చెన్నై: తమిళనాడులో తెలుగు, ఇతర మైనార్టీ భాషల విద్యార్థుల గొంతు నొక్కేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది మైనార్టీ భాషల విద్యార్థులు వారి మాతృభాషలోనే పరీక్ష రాసే అవకాశం కల్పించాలని విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై హైకోర్టు స్పందించింది. విద్యార్థులు తమ మాతృభాషలోనే పరీక్ష రాస్తామని దరఖాస్తు చేసుకుంటే దానిని పరిశీలించారని ఉన్నత న్యాయస్థానం జయలలిత ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, కోర్టు ఇచ్చిన వెసులుబాటును ప్రభుత్వం పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి.
తెలుగు సహా ఇతర బాషల విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటి దాకా జీవో రాలేదు. అంతేకాదు, విద్యార్థులు తప్పకుండా తమిళ పరీక్షే రాయాలని, వారిపై అలా ఒత్తిడి తేవాలని ప్రభుత్వం ప్రధానోపాధ్యాయులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోందని వార్తలొస్తున్నాయి.
తెలుగు లేదా ఇతర మైనార్టీ భాషల విద్యార్థులు... తాము తమ మాతృభాషలో పరీక్ష రాస్తామని లేఖలు ఇస్తే వాటిని విద్యాశాఖకు పంపించవద్దని, వాటిని ఉపసంహరించుకునేలా విద్యార్థులను ఒప్పించాలని సూచించిందని వార్తలు వస్తున్నాయి. ఇది అందర్నీ కలవరపరుస్తోంది. కాగా, దీని పైన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పందించాలని చాలామంది కోరుతున్నారు. ముఖ్యమంత్రుల స్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటున్నారు.