జగన్పార్టీ నేత సుధ భర్తకు గాయాలు, ప్రమాదం(ఫోటో)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి అల్లుడు లతీశ్వర్ రెడ్డికి సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలైన విషయం తెలిసిందే. ఆయనకు మొదట హయత్ నగర్లోని ఆ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం స్టార్ ఆసుపత్రికి తరలించారు.
రంగారెడ్డి - నల్గొండ జిల్లాల సరిహద్దులోని కొత్తగూడెం ప్రాంతంలో జాతీయ రహదారి పైన నన్నపనేని అల్లుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు నన్నపనేని సుధ భర్త లతీశ్వర్ రెడ్డికి గాయాలయ్యాయి. వంతెన పై నుండి కారు బోల్తా పడింది. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. దీంతోకారులో ఉన్న నన్నపనేని అల్లుడు లతీశ్వర్ రెడ్డి రెడ్డి, డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి.
లతీశ్వర్ రెడ్డి పరిస్థితి ఇరవై నాలుగు గంటలు దాటితే కానీ ఏమీ చెప్పలేమని స్టార్ ఆసుపత్రి వైద్యులు సోమవారం తెలిపారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్ దాటాక డ్రైవరును విశ్రాంతి తీసుకోమని చెప్పి కారును లతీశ్వర్ రెడ్డి నడిపారు. కారు రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించగానే హయత్ నగర్ మండలం కొత్తగూడెం ప్రాంతంలో జాతీయ రహదారి మీద నుంచి అదుపు తప్పి రెండు వంతెనల మధ్య దిగువన ఏరులో పడిపోయింది.