ఆళ్లగడ్డపై పవన్ కళ్యాణ్ జోక్యం: భూమా కారణంగానేనా?
హైదరాబాద్: ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పోటీ వద్దని సూచించినట్లుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్య భూమా నాగిరెడ్డి విజ్ఞప్తి మేరకు పవన్ కల్పించుకొని ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ నేత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్తో ఉన్న పరిచయంతో భూమా నాగిరెడ్డి.. చంద్రబాబుతో మాట్లాడాలని ఆయనను కోరి ఉంటారని భావిస్తున్నారు. భూమా కుటుంబానికి కూడా చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆళ్లగడ్డ ఉప ఎన్నికలపై చంద్రబాబు పార్టీ జిల్లా నేతలతో చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
అయితే, ఇప్పటికే టీడీపీ పోటీ వద్దని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ తప్పుకోవడంలో పవన్ కళ్యాణ్ చొరవ కూడా ఉందని అంటున్నారు. ఇటీవల కృష్ణా జిల్లా నందిగామ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు. తండ్రి మృతి చెందడంతో ఆమె స్థానంలో టీడీపీ తరఫున తంగిరాల సౌమ్య పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలిపింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలోని సాంప్రదాయాన్ని అనుసరించి పోటీకి దూరంగా ఉంది.
ఇప్పుడు ఆళ్లగడ్డ నుండి కూడా శోభా నాగిరెడ్డి మృతి చెందడంతో.. ఆమె స్థానంలో పోటీ చేస్తున్న కూతురు అఖిల ప్రియ పైన టీడీపీ పోటీ పెట్టదని వైసీపీ భావిస్తోంది. అయితే, టీడీపీ మంతనాలు చూస్తుంటే పోటీ చేసే అవకాశాలే ఉన్నట్లుగా కనిపించింది. అంతేకాకుండా స్థానిక నేతలు కూడా పోటీ చేయాలని పట్టుబడుతున్నారు. చంద్రబాబు పైన ఒత్తిడి తెచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పోటీకి నిలబెట్టవచ్చుననే ఉత్కంఠ కొనసాగింది.
మూడు రోజుల క్రితం స్థానిక టీడీపీ నేత మాట్లాడుతూ.. తాము ఆళ్లగడ్డ నుండి పోటీ చేస్తామని, చంద్రబాబు విశాఖ పర్యటన ముగించుకొని వచ్చాక నిర్ణయం తీసుకుంటారని ప్రకటించారు.
దీంతో, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కల్పించుకున్నారని తెలుస్తోంది. పార్టీలు పాటిస్తున్న సంప్రదాయం ప్రకారం పోటీకి నిలబెట్టవద్దని చంద్రబాబుకు పవన్ సూచించారని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు పార్టీ నేతలకు అదే అంశమై సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. అయితే, చంద్రబాబు కూడా పోటీకి విముఖత చూపినప్పటికీ, పార్టీ నేతల నుండి వస్తున్న ఒత్తిడి కారణంగానే ఇన్నాళ్లు ఉత్కంఠ సాగిందని అంటున్నారు.