గర్జించిన రాయలసీమ 'తమ్ముళ్లు'
రాయలసీమలో పూర్తికాని ప్రాజెక్టులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ సీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాదయాత్ర నిర్వహించారు. కర్నూలు జిల్లా హాలహర్వి నుంచి గూళ్యం వరకు ఈ యాత్ర సాగింది. అక్కడ ఏర్పాటు చేసిన సభలో పార్టీ నాయకులు మాట్లాడుతూ వేదవతి నదిపై ప్రాజెక్టు పూర్తిచేయడానికి తెలుగుదేశం హయాంలో రూ.2వేల కోట్లు నిధులు మంజూరు చేశామని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, ఆదోని నియోజకవర్గాలకు సాగునీరు, తాగునీరు పూర్తిగా అందుబాటులోకి వచ్చేదన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు అంచనా విలువ తగ్గించడమే కాకుండా నిధులను కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. ప్రాజెక్టులు పూర్తిచేయడం చంద్రబాబునాయుడివల్లే సాధ్యపడుతుందని నొక్కి వక్కాణించారు.
కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డి, అతని తండ్రి ముఖ్యమంత్రులై వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో రూ.900 కోట్లతో డ్రిప్ ఇరిగేషన్, రూ.450 కోట్లతో బీటీపీ ప్రాజెక్టులకు తెలుగుదేశం ప్రభుత్వం నిధులిచ్చిందని, వైసీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్ రాతపూర్వకంగా ప్రాజెక్టు వద్దంటూ రాసివ్వడం అత్యంత దురదృష్టకరమని పయ్యావుల కేశవ్ అన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, కేఈ ప్రభాకర్, బీటీ నాయుడు, వైకుంఠం ప్రభాకర్ చౌదరి, భూమా అఖిలప్రియ, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బి.వి.జయనాగేశ్వర్ రెడ్డి, మీనాక్షి నాయుడు, గౌరు చరిత, బీసీ జనార్ధన్ రెడ్డి, బీకే పార్థసారధి తదితర నేతలు పాల్గొన్నారు.