కేసీఆర్కే ఎలా సాధ్యమైందో, గిన్నిస్ రికార్డ్: వెక్కిరించిన టీడీపీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇటీవల చేసిన వ్యాఖ్యల పైన తెలుగుదేశం పార్టీ నేతలు చురకలు అంటిస్తున్నారు. తాను ఇప్పటి వరకు డెబ్బై ఎనభై వేల పుస్తకాలు చదివానని కేసీఆర్ ఇటీవల అన్నారు.
దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పుడుతూనే చదవడం ప్రారంభించినా 80వేల పుస్తకాలు చదవలేరని, అలాంటిది 65 ఏళ్లకే అన్ని పుస్తకాలు చదవడం కేసీఆర్కు ఎలా సాధ్యమైందోనని టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ఎద్దేవా చేశారు.
కేసీఆర్ పుట్టిన రోజు నుండి నేటి వరకూ నిరంతరం రోజుకో పుస్తకం చదివినా 65 ఏళ్లలో 23,725 పుస్తకాలు మాత్రమే చదవగలరని, అలాంటిది ఆయన ఏవిధంగా చదివారో భగవంతుడికే అర్థం కానిదన్నారు. కేసీఆర్ తాను ఏ సంవత్సరంలో పుస్తకాలు చదవడంలో ప్రారంభించారో కూడా చెప్పాలని అన్నారు.
65 ఏళ్లకే 85వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ను గిన్నిస్ బుక్లోకి ఎక్కించాలని ఏపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తెరాస శిక్షణా తరగతులకు హాజరైంది ప్రజాప్రతినిధులు అని తెలిసి కూడా కేసీఆర్ ఇలాంటి గొప్పలు చెప్పడం విడ్డూరమన్నారు.
కాగా, ఇటీవల మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో ఇజ్రాయెల్లో వ్యవసాయాన్ని పరిశీలించేందుకు వెళ్తున్నారనే సమయంలోను టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు సెటైర్లు వేశారు. కేసీఆర్ తన పొలంలో ఎకరాకు కోట్ల రూపాయలు తీస్తున్నారని, అలాంటప్పుడు ఇజ్రాయెల్ దాకా వెళ్లడం ఎందుకని, కేసీఆరే రైతులకు సూచనలు చేస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు.