అయ్యన్న "ప్రహరీ గోడ"తో ఉత్తరాంధ్రపై బిగిసిన తెలుగుదేశం పట్టు?
తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను కూల్చివేసిన సంఘటన తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చిపెట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పంటకాల్వను ఆక్రమించి కట్టారంటూ అర్థరాత్రి సమయంలో నర్సీపట్నం కమిషనర్ పేరుతో అయ్యన్నపాత్రుడి ఇంటిగోడను అధికారులు కూల్చివేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. వేలమంది కార్యకర్తలు నర్సీపట్నం తరలివచ్చారు.
పట్టుదలగా నర్సీపట్నం చేరుకున్న టీడీపీ శ్రేణులు
ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలు నర్సీపట్నం చేరుకున్నారని ఇంటిలిజెన్స్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ సంఘటన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఒకరకంగా కసిని పెంచిందని, అందుకే వారు పట్టుదలగా పోలీసుల కన్నుగప్పి నర్సీపట్నం చేరుకున్నారని ఆ నివేదికలో వివరించారు. అయ్యన్నపాత్రుడి పెద్ద కుమారుడు విజయ్ గోడను కూల్చివేసిన తర్వాతరోజు నిరసన దీక్ష చేపడితే అందుకు మద్దతు కూడా ఊహించని రీతిలో వచ్చిందని, వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారనే విషయాన్ని కూడా వివరించారు.
ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేస్తున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో గట్టి పట్టుంది. 2019 ఎన్నికల్లో మాత్రం దెబ్బతింది. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను తమకు గట్టి పునాదులున్న ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు తన జిల్లాల పర్యటన, మినీ మహానాడులను అక్కడినుంచే ప్రారంభించారు. వాటికి కూడా అనూహ్య స్పందన లభించింది.
మేమే టీడీపీని బలోపేతం చేస్తున్నామంటున్న వైసీపీ నేతలు
నాయకులను అరెస్ట్ చేయించడం, గోడలను కూల్చివేయించడం లాంటి సంఘటలన్నీ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఏకాతాటిపైకి తెస్తున్నాయని సీనియర్ రాజకీయవేత్తలు సైతం భావిస్తున్నారు. ఒకరకంగా మేం అనుసరిస్తున్న విధానాలే టీడీపీని బలోపేతం చేస్తున్నాయని, అందుకే మహానాడుకు, చంద్రబాబు పర్యటలనకు జనం పోటెత్తుతున్నారని వైసీపీ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. టెక్కలి నుంచి అనకాపల్లి వరకు ప్రతి నియోజకవర్గంలో బలమైన నేతలను నియమించడంతోపాటు ఉన్న నేతలను సమన్వయం చేసుకునే బాధ్యత కూడా చంద్రబాబే తీసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లు సాధించాలన్నదే టీడీపీ లక్ష్యంగా ఉంది. ఆ లక్ష్యానికి ప్రభుత్వం కూల్చివేయించిన అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూడా తనవంతు సహకారం అందిస్తోంది.