జగన్ పార్టీకి ఝలక్: పార్టీలో చేర్చుకొని గెలిపించుకున్న టిడిపి, అక్కడే ట్విస్ట్
శ్రీకాకుళం జిల్లా జి సిగడాం మండలం గెడ్డకంచరాం ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టిడిపి గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి సూరీడమ్మ వైసిపి అభ్యర్థి పోలమ్మపై 228 ఓట్ల తేడాతో గెలుపొందారు.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా జి సిగడాం మండలం గెడ్డకంచరాం ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టిడిపి గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి సూరీడమ్మ వైసిపి అభ్యర్థి పోలమ్మపై 228 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికను టిడిపి - వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఇప్పుడు టిడిపి నుంచి గెలిచిన సూరీడమ్మ, 2014 ఎన్నికల్లో వైసిపి తరఫున గెలుపొందారు. ఆ తర్వాత టిడిపిలో చేరారు. దీంతో వైసిపి ఆమెపై అనర్హత వేటు వేసింది. ఈ కారణంతో ఈ ఉప ఎన్నికను ఇరు పార్టీలు ప్రతిష్టగా తీసుకున్నాయి.
జగన్ ఆ ఛాన్స్ ఉపయోగించుకోలేదు, సర్వనాశనం: జేసీ, కేశినేని హెచ్చరిక
సూరీడమ్మ మొదట గెడ్డకంచరాం ఎంపీటీసీగా వైసిపి నుంచి గెలుపొంది, ఎంపీపీ ఎన్నికల సమయంలో టిడిపిలో చేరారు. ఆమె ఎన్నికపై వైసిపి నాయకులు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. మళ్లీ ఉప ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో 21న జరిగింది. ఈసారి సూరీడమ్మ టిడిపి నుంచి నెగ్గారు.
కళా వెంకట్రావు నియోజకవర్గం మాత్రమే కాకుండా..
గెడ్డకంచరాం గ్రామం టిడిపి అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఉంది. టిడిపికి ఈ ఎన్నికల్లో గెలవడం అనివార్యం. ఎంపీపీ స్థానం దక్కాలంటే ఈ ఎన్నికల్లో గెలవాల్సిన పరిస్థితి.
టిడిపికి బలం ఉన్నా.. పదవిపై చిక్కు
గత ఎన్నికల్లో జి సిగడాం మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 8 టిడిపి, ఏడు వైసిపి గెలిచింది. ఒక స్థానంలో స్వతంత్ర్య అభ్యర్థి గెలిచారు. ఆ తర్వాత టిడిపిలో చేరారు. దీంతో టిడిపి బలం 9కి చేరింది. ఎంపీపీ దక్కించుకోవడానికి సరిపడా బలం టిడిపికి ఉంది. కానీ ఎంపీపీ పదవి ఎస్సీలకు రిజర్వ్ అయింది.
అక్కడే ట్విస్ట్.. వైసిపి నుంచి జంప్
ఎస్సీలకు రిజర్వ్ అయిన రెండు స్థానాల్లోను వైసిపి గెలిచింది. టిడిపి నుంచి ఎవరు గెలవలేదు. వైసిపి నుంచి గెలిచిన ఇద్దరిలో ఒకరు సూరీడమ్మ. దీంతో ఆ తర్వాత టిడిపి నేతలు ఆమెకు ఎంపీపీ పదవి ఇస్తామని చెప్పి టిడిపి వైపు తిప్పుకున్నారు. ఆమెను ఎంపీపీగా గెలిపించుకున్నారు.
గెలిచి, రెండూ కోల్పోయిన సూరీడమ్మ
ఎంపీపీ ఎన్నికల సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తమ సభ్యులకు విప్ జారీ చేసింది. ఇందులో భాగంగా సూరీడమ్మకు కూడా జారీ చేశారు. ఆమె టిడిపిలోకి జంప్ అయి, ఎంపీపీ కావడంపై.. వైసిపి కోర్టు మెట్లెక్కింది. దీంతో ఆమె ఎంపీటీసీ స్థానంతో పాటు ఎంపీపీ పదవిని కూడా కోల్పోయారు. దీంతో ఈ ఎన్నికలు జరిగాయి.
తమ పార్టీలోకి వచ్చి,
రెండు పదవులు కోల్పోయిన సూరీడమ్మపై సానుభూతి కురిసింది. సూరీడమ్మపై అనర్హత వేటు, రెండు పదవులు పోయిన తర్వాత వైసిపి... టిడిపితో రాజీబేరానికి కూడా వచ్చిందని అంటారు. తమ పార్టీ నుంచి గెలిచి, ఫిరాయించిన సూరీడమ్మను కాకుండా మరెవరిని టిడిపి అభ్యర్థిగా పెట్టినా ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తామని వైసిపి చెప్పింది. కానీ తమ పార్టీలోకి వచ్చి ఎంపీపీ పదవితో పాటు ఉన్న పదవి కోల్పోయిన సూరీడమ్మను గెలిపించాలని టిడిపి భావించింది. ఉత్కంఠ మధ్య ఆమె గెలిచారు. ఇప్పుడు ఎంపీటీసీతో పాటు మళ్లీ ఆమెకు ఎంపీపీ పదవి దక్కనుంది.