ఖమ్మం జెడ్పీపై బాబు పట్టు, బుట్టలో పడకుండా విశాఖ..
ఖమ్మం: ఖమ్మం జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఖమ్మం జిల్లాలో అత్యధిక జెడ్పీటీసీ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఆ పార్టీకి ఒక్క జెడ్పీటీసీ మద్దతు కావాలి. అయితే, ఈలోగానే తమ వారు మరో పార్టీలో బుట్టలో పడకుండా ఉండేందుకు టీడీపీ తమ పార్టీకి చెందిన 19 మంది జెడ్పీటీసీలను ఉత్తరాంధ్రకు తీసుకు వెళ్లిందట.
ఆగస్టు ఏడో తేదీన ఖమ్మం జెడ్పీ, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక జరగనుంది. ఆ లోగా తమ వారిని ఇతర పార్టీలు బుజ్జగించేందుకు అవకాశం ఇవ్వకుండా ట్రిప్కు తీసుకు వెళ్లింది. వారిని తిరిగి ఆగస్టు ఆరో తేదిన రాత్రి పూట ఖమ్మంకు తీసుకు రానున్నారట. వారిని విశాఖ దగ్గరలోని ఓ ప్రాంతంలో ఉంచారట.
ఖమ్మం జెడ్పీని, వైస్ చైర్మన్ పదవులను ఎలాగైనా దక్కించుకోవాలని టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఖమ్మం జిల్లా నేతలు నామా నాగేశ్వర రావు, తుమ్మల నాగేశ్వర రావు, ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర రావులకు సూచించారు. జెడ్పీ, వైస్ చైర్మన్ ఎన్నికల బాధ్యతలను వారు చంద్రబాబుకే అప్పగించారు.
అయితే, తుమ్మల నాగేశ్వర రావు గాడిపల్లి కవితకు, నామా నాగేశ్వర రావు తోకల లతకు, పొట్ల నాగేశ్వర రావు కోవెల శ్యామలలకు జెడ్పీ పదవి దక్కాలని కోరుకుంటున్నారు. అందుకోసం వారు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, టీడీపీలోని పరిణామాలను కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, సీపీఎంలు పరిశీలిస్తున్నాయి. టీడీపీలో ఏదైనా అనుకోనిది జరిగితే తాము దక్కించుకోవాలని చూస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ పైన ఆశలు పెట్టుకుంది. వారు బైకాట్ చేస్తే టీడీపీ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది.