మురిపించి.. ముఖం చాటేసి: మళ్లీ భగ్గుమంటోన్న తెలుగు రాష్ట్రాలు
విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత మళ్లీ పెరుగుతోంది. కొద్దిరోజుల పాటు చల్లగా మారిన వాతావరణం మళ్లీ హీటెక్కింది. ఎండ తీవ్రత ఉధృతమౌతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఏపీ, తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా రికార్డవుతోంది. ఏపీలోని కోస్తా తీరం, దక్షిణ ప్రాంత జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రత అసాధారణంగా నమోదవుతోంది. హఠాత్తుగా ఎండ తీవ్రత పెరగడానికి కారణం.. ఉపరితల ఆవర్తనం బలహీన పడటమే కారణమని వాతావరణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు.
ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడటం వల్ల ఎండ తీవ్రత పెరిగిందని చెబుతున్నారు. మరో 72 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ఆ తరువాత స్వల్పంగా తగ్గే అవకాశాలు లేకపోలేదని అంచనా వేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడుల్లో ఉపరితల ద్రోణులు కొనసాగుతున్నాయని, అవి బలహీనంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. మరింత బలపడితే.. వచ్చే రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రత తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొన్నటిదాకా మురిపించిన మబ్బులు.. ఆవర్తనం బలహీనపడటంతో తొలగిపోయాయి.
Recommended Video
ఉపరితల ద్రోణి బలపడితే అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడొచ్చని స్పష్టం చేశారు. ఎండ తీవ్రత మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం నాటి రికార్డుల ప్రకారం కొమరం భీమ్ ఆసిఫాబాద్లో అత్యధికంగా 41 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో నాలుగు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు సైతం కురిశాయి. ఇదే తరహా వాతావరణం ఏపీ ఉత్తర ప్రాంత జిల్లాల్లో నెలకొంది. విజయనగరం జిల్లాలో తేలికపాటి వర్షపాతం నమోదైంది.