ఎపి రాజధాని జస్టిస్ సిటీలోనే...తాత్కాలిక హైకోర్టు
అమరావతి: నవ్యాంధ్ర రాజధానిలో నిర్మించే జస్టిస్ సిటీలోనే ఎపి తాత్కాలిక హైకోర్టును కూడా ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. సుమారుగా మరో 8 నెలల్లో ఈ నిర్మాణం పూర్తి కానున్నందున్న, టెంపరరీ హైకోర్టును కూడా అక్కడే ఏర్పాటు చేసేందుకు న్యాయమూర్తుల కమిటీ అంగీకరించినట్లు సిఆర్డిఏ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలిపారు.
లండన్, న్యూఢిల్లీ మహా నగరాల్లోని నిర్మాణాలను స్ఫూర్తిగా తీసుకొని నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని ప్రభుత్వ నగరి నిర్మాణం కాబోతున్నట్లు ఎపి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో 3438 ఎకరాల్లో నిర్మించే న్యాయనగరిలో అంతర్భాగంగా రూ.108 కోట్లతో సిటీ సివిల్ కోర్టుల భవన సముదాయం నిర్మించనున్నారు. వాటిలోనే ఒక చోట ఎపి తాత్కాలిక హైకోర్టును ఏర్పాటు చేయాలన్న సిఆర్డిఏ ప్రతిపాదనకు న్యాయమూర్తులు బృందం ఆమోదం తెలిపినట్లు సమాచారం.

మోడల్ సిటీలో...ప్రభుత్వ నగరి...అందులో జస్టిస్ సిటీ...
నవ్యాంధ్ర రాజధానిలో ప్రభుత్వ నగరి అమరావతిని ప్రత్యేకంగా...ప్రపంచంలోనే ఒక మోడల్ సిటీగా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే లండన్, న్యూఢిల్లీ మహా నగరాల్లోని నిర్మాణాలే స్ఫూర్తిగా ఈ ప్రభుత్వ నగరి నిర్మాణం చెయ్యాలని ఎపి ప్రభుత్వం తలపోస్తోంది. ఈ మేరకు రాజధాని నిర్మాణ డిజైన్ల తయారీకి ఎంపికైన లండన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థ...ఈ ప్రభుత్వ నగరిలోని డిజైన్ల తయారీకి ముందు లండన్, వాషింగ్టన్, న్యూఢిల్లీలోని ప్రభుత్వ భవనాలు, ప్రధాన వీధులు, ఇతర ఆకర్షణీయ వసతులపై పరిశీలన జరిపింది. తదనంతరం అమరావతిలోని అడ్మినిస్ట్రేటివ్ సిటీ నిర్మాణానికి సంబంధించి ప్రాథమిక డిజైన్లను రూపొందించి ప్రభుత్వానికి అందచేయగా, ప్రభుత్వం వాటిని మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఆ రెండింటికి...అత్యధిక ప్రాధాన్యం...
ఈ డిజైన్లలో అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లకు ఎపి ప్రభుత్వం ఆమోదం తెలపగా వాటిని మరెక్కడా లేని విధంగా మకుటాయమానంగా నిర్మించాలని నిర్ణయించారు. మిగిలిన వాటిని కూడా ప్రత్యేక శ్రద్ధతో నిర్మించినా ఈ రెండింటి నిర్మాణానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వ నగరి పరిధిలోనే అసెంబ్లీ భవనం రానుండగా దానికి వెనుకనే జస్టిస్ సిటీ రూపుదిద్దుకోనుంది.

8 నెలల్లో నిర్మాణం పూర్తి
8 నెలల్లో నిర్మాణం పూర్తి...అందులోనే తాత్కాలిక హైకోర్టు...
ఈ జస్టిస్ సిటీలో రూ.108 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సిటీ సివిల్ కోర్టుల్లోనే తాత్కాలిక హైకోర్టును కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 1.96 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ సముదాయం 8 నెలల్లో పూర్తి కానుందని సిఆర్డిఏ అధికారులు చెబుతున్నారు. ఇందులో తాత్కాలిక హైకోర్టును నడిపేందుకు...తాత్కాలిక భవనం ఎంపిక పరిశీలనకు వచ్చిన న్యాయమూర్తుల బృందం కూడా అంగీకరించిందని, సీఆర్డీఏ అధికారులు సీఎం చంద్రబాబుకు సోమవారం తెలియజేశారని...దీంతో చంద్రబాబు కూడా సంతోషించారని సమాచారం.

హైకోర్టు వస్తే...చెయ్యాల్సినవి ఇవీ
హైకోర్టు రాష్ట్రానికి తరలివస్తే...అందుకోసం 24 కోర్టు హాళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో 40 కోర్టు హాళ్లు ఉన్నాయి. విభజన జరిగాక వాటిలో 24 ఏపీకి వస్తాయి...అలాగే 15 మంది న్యాయమూర్తులు రానున్నారు. హైకోర్టులో చిన్న బెంచ్ల హాళ్లు 40-20 అడుగుల సైజులో ఉండాలి. అదే చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని కోర్టు హాళ్ల పరిమాణం 100-60 అడుగుల పరిమాణంలో ఉండాలి. వీటినే కోర్టు-1గా పిలుస్తారు.












Click it and Unblock the Notifications