టెన్షన్: వైయస్ జగన్ కుప్పం సమైక్య శంఖారావం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గమైన కుప్పం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం మధ్యాహ్నం సమైక్య శంఖారావం యాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం వేడేక్కింది. సొంత నియోజకవర్గం కావడంతో చంద్రబాబుపై ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకునే అవకాశం ఉన్నందున పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా కుప్పంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా స్థానికంగా ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేశారు. అక్కడికి భారీగా చేరుకున్న టిడిపి శ్రేణులు ఎన్టీఆర్ అమర్ హై, చంద్రబాబు నాయుడు జిందాబాద్ అని నిదాలు చేశారు.

ఆ తర్వాత అక్కడికి వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ జిందాబాద్, వైయస్సార్ అమర్ రహే, జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కుప్పంలో బహిరంగ సభ నిర్వహించి సమైక్య శంఖారావాన్నిప్రారంభించనున్నారు. అంతకుముందే వైయస్ మరణవార్త విని అసువులు బాసిన వారి కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా పరామర్శించనున్నారు.
చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జగన్ పర్యటన సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణలు నెలకొనే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా టిడిపి వర్గాలు అడ్డుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పోలీసులు ఇరువర్గాలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకూడదని హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications