తెలంగాణ బాటలోనే ఏపీ - ఈసారి ఉద్యోగుల జీతాల్లో కోత తప్పదా ?
ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. అసలే రెవెన్యూ లోటుతో సతమతం అవుతున్న రాష్ట్రానికి కరోనా వైరస్ శనిలా దాపురించిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయం నానాటికీ తగ్గిపోతోంది. దీంతో ఈ నెల జీతాలు, పింఛన్లపై ఏ నిర్ణయం తీసుకోవాలనే అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.
Recommended Video
ఏపీలో ఉద్యోగుల జీతాలు, పింఛన్లు...
కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో గత నెలలో ఏపీలో ఉద్యోగుల జీతాలు, పింఛన్లను రెండు విడతలుగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల మొదటి వారంలో ఓ వాయిదా చెల్లించిన ప్రభుత్వం, పరిస్దితులు మెరుగుపడ్డాక మరో విడత చెల్లిస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చింది. అయితే మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ లో రాబడి మరింత తగ్గిపోయింది. అదే సమయంలో రుణాలపై వడ్డీల చెల్లింపుల భారం ఉండనే ఉంది. దీంతో ప్రభుత్వం ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనే అంశంపై ఉత్కంఠ పెరుగుతోంది.
ఈసారి జీతాలు, వేతనాల కోత తప్పదా ?
మార్చి నెల చివరి వారంలో వచ్చిన కరోనా మహమ్మారి ప్రభావంతో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను రెండు విడతలుగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈసారి మరింత తగ్గిన ఆదాయం నేపథ్యంలో మరోసారి ఇలాంటి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో మరింత భారం తప్పదు. అందుకే తెలంగాణ ప్రభుత్వ తరహాలో కోతలు పెడితే ఎలా ఉంటుందన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే గత నెలలో సగం జీతాలు ఇస్తేనే విపక్షాల నుంచి విమర్శలు ఎదురైన నేపథ్యంలో ఈసారి కోత విధిస్తే ఎదురయ్యే పరిణామాలపై ప్రభుత్వం చర్చిస్తోంది. భారీగా రాబడి తగ్గిపోయిన తరుణంలో కోతకు మించిన మార్గం కనిపించడం లేదని ఆర్ధిక శాఖలో ఉన్నతాధికారులు చెబుతున్నారు.
లాక్ డౌన్ సడలింపుల ప్రభావం..
ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో పరిశ్రమలకు కొన్ని పరిమితులతో సడలింపులు ఇచ్చారు. వచ్చే నెలాఖరు వరకూ పరిశ్రమల కార్యకలాపాలన్నీ సాధారణ స్ధితికి చేరుకుంటే తప్ప రాష్ట్రానికి ఆదాయం రావడం మొదలు కాదు. అలాగే క్వారీలు, ఇసుక ర్యాంపుల్లో కార్యకలాపాల పునరుద్ధరణ కూడా జరగాల్సి ఉంది. మే 3 తర్వాత ఇసుక ర్యాంపులు, క్వారీలు కూడా పనిచేయడం ప్రారంభిస్తే రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిలో స్వల్పంగా అయినా మార్పు వస్తుంది. దీంతో ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా పారిశ్రామిక కార్యకలాపాలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ లెక్కన చూసినప్పుడు ఏప్రిల్ నెల జీతాల్లో మాత్రం మరోసారి కోతలు తప్పేలా లేవు. చివరి నిమిషంలో అద్భుతాలు జరిగితే తప్ప గత నెల తరహాలో వాయిదాల లెక్కల జీతాలు, పింఛన్ల చెల్లింపు కూడా ఉండకపోవచ్చని చెబుతున్నారు.