ఒమిక్రాన్కు ఆనందయ్య మందు: పంపిణీ నిలిపివేయాలంటూ గ్రామస్తుల ధర్నా: కృష్ణపట్నంలో ఉద్రిక్తత
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్.. ఏపీలో పెరుగుదల బాట పట్టింది. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే- ఈ సంఖ్య తక్కువే అయినప్పటికీ.. శరవేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదు. తొలి పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చిన అతి కొద్దిరోజుల్లోనే ఈ సంఖ్య మరింత పెరిగింది. భయాందోళనలకు గురి చేస్తోంది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కెన్యా నుంచి తిరుపతికి వచ్చని ఓ విదేశీ మహిళ ఒమిక్రాన్ బాధితుల్లో ఉన్నారు.
విజయవాడ టీడీపీలో సడన్ ఛేంజ్: వల్లభనేని వంశీకి చెక్: గన్నవరం అభ్యర్థిగా లగడపాటి కొడుకు
ఒమిక్రాన్కు సైతం..
ఈ పరిస్థితుల్లో కృష్ణపట్నం ఆనందయ్య.. మళ్లీ తెర మీదికి వచ్చారు. కరోనా వైరస్ కంటే అత్యంత ప్రమాదకరమైన ఒమిక్రాన్ వేరియంట్కు కూడా మందును కనిపెట్టానని ప్రకటించారు. దీన్ని తయారు చేసే విధానాన్ని కూడా ఆయన వివరించారు. కరోనా వైరస్ బారిన పడిన తరువాత లక్షల రూపాయలను ధారపోసి కూడా ప్రాణాలను నిలుపుకోలేని వారు చాలామంది ఉన్నారని చెప్పారు. తన మందును వాడి ఆరోగ్యవంతులయ్యారని, దానికి అవసరమైన సాక్ష్యాధారాలు కూడా ఇస్తానని పేర్కొన్నారు.
ఎక్కడెక్కడి నుంచో..
ఆనందయ్య కరోనా వైరస్ మందును పంపిణీ చేస్తోన్నందున రోజూ పలువురు కృష్ణపట్నానికి చేరుకుంటోన్నారు. వారివల్ల తమకు ఇబ్బందులు కలుగుతున్నాయంటూ గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. మందు పంపిణీని నిలిపివేయాలంటూ ఆనందయ్య ఇంటి వద్ద ధర్నా చేశారు. ఎక్కడెక్కడి నుంచో అంబులెన్సుల్లో కరోనా వైరస్ బాధితులు తమ గ్రామానికి వస్తుండటం వల్ల తాము అనేక పాట్లు పడుతున్నామని చెబుతున్నారు. లేని వ్యాధులు ముసురుకునే ప్రమాదం పొంచివుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రోగాలొస్తే.. ఎవరిది బాధ్యత..
తమ డిమాండ్ను కాదని ఆనందయ్య మందు పంపిణీ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఆనందయ్య నివాసం వద్ద కు చేరుకున్న కొందరు మందుపై స్పష్టత వచ్చే వరకు పంపిణీ చేయకూడదు డిమాండ్ చేశారు. ఆనందయ్య మెడిసిన్ కోసం ఇతర రాష్ట్రాల నుంచి వస్తోండటం వల్ల గ్రామంలో అనారోగ్యకర వాతావరణం నెలకొందని, తమకూ కరోనా సోకుతుందని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్కు మందు కనిపెట్టినట్టు ఆనందయ్య అసత్య ప్రచారం చేస్తోన్నారని మండిపడుతున్నారు.
ఇంటి వద్ద ఉద్రిక్తత..
తాము అనారోగ్యం బారిన పడితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కొందరు అనారోగ్యానికి గురయ్యారని అంటున్నారు. తక్షణమే ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేయాలని డిమాండ్ చేస్తోన్నారు. ఆయన ఇంటి వద్ద పెద్ద ఎత్తున గుమికూడి, ఆందోళనకు దిగారు. దీనితో ఆనందయ్య ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తులను నచ్చజెప్పారు.
మానవత్వం మరిచిపోతే ఎలా..
తాను మందు పంపిణీ చేయడాన్ని స్థానికులు అడ్డుకుంటోండటం పట్ల ఆనందయ్య స్పందించారు. బయటి ప్రపంచం తనకు మద్దతు ఇస్తోందని, స్థానికులు మానవత్వాన్ని మరిచి తనకు ఎదురు తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. మందును పంపిణీ చేస్తూ తానేమీ కోట్ల రూపాయలను వెనకేసుకోలేదని అన్నారు. మందు పంపిణీకి కోర్టు అనుమతి ఉందని ఆనందయ్య స్పష్టం చేశారు. కరోనా నుంచి రక్షణ పొందడానికి మందు కోసం చాలా మంది వస్తున్నారని, వారిని నిరాశపర్చడం సరికాదని అన్నారు.