విజయవాడలోనూ ఉద్రిక్తత: మోడీని నేరుగా టార్గెట్ చేసిన కన్నయ్య
హైదరాబాద్: ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ రాక సందర్భంగా విజయవాడలోని ఐవి ప్యాలెస్ వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కన్నయ్యను అడ్డుకోవడానికి బిజెపి, దాని అనుబంధ సంస్థల నాయకులు, కార్యకర్తలు ఐవి ప్యాలెస్ వద్ద అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
ఈ సందర్భంగా బిజెపి, అనుబంధ సంస్తల కార్యకర్తలకు, వామపక్ష కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పర దాడులకు దిగారు. కర్రలతో దాడులు చేసుకున్నారు. దాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు లాఠీ చార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు.
ఆ తర్వాత జరిగిన సమావేశంలో కన్నయ్య కుమార్ నేరుగా ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యం చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. మోడీ మన్ కీ బాత్లో మన బాత్ ఉండదని, మనది మన్ కీ బాత్ అని ఆయన అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు.
వేముల రోహిత్ బలిదానం వృధా కాదని తాను ఆయన తల్లికి చెప్పానని, రోహిత్ ఆశయాల సాధనకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. మోడీ నల్లధనం తెస్తామన్నారు, ఏమైందని ఆయన అడిగారు. ప్రజల ఆహారావసరాలకు పట్టించుకోరు గానీ బుల్లెట్ ట్రైన్ తెస్తామని అంటున్నారని ఆయన అన్నారు.
విశ్వవిద్యాలయాల్లో బ్రాహ్మణవాదం రాజ్యమేలుతోందని, చదువుకోవడానికి కూడా దళితులు పోరాటం చేయాల్సి వస్తోందని అన్నారు. మోడీ మనసులో మాట చెబుతారు గానీ మన మాట వినరని ఆయన అన్నారు. ఈ దేశంలో ఓ మతానికో, కులానికో చెందింది కాదని అన్నారు.

స్వచ్ఛ భారత్ ద్వారా దుర్గంధాన్ని తొలిగించడానికి బదులు దళితులను తొలగించాలని అనుకుంటున్నారని ఆయన విమర్శించారు. మోడీ ఎన్నికల వాగ్దానాలు ఏమయ్యాయని ఆయన అన్నారు. అవసరం కొద్ది తాము పోరాటం చేయాల్సి వస్తోందని ఆయన చెప్పారు. సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం పోరాటం చేయాల్సి వస్తోందని ఆయన అన్నారు.
దేశాన్ని అభివృద్ధి చేయడాన్ని వదిలేసి రామమందిరాన్ని నిర్మిస్తామని అంటున్నారని ఆయన అన్నారు. విద్యార్థులకు రాజకీయాలు వద్దు చదువుకోవాలని అంటున్నారని, ఆ మాట పాతికేళ్ల క్రితం అని ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. తాము విద్యార్థులమని, చదువుకోవాలని అనుకుంటున్నామని, మోడీ చేయాల్సిన పని చేస్తే తాము అదే పని చేస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications