టై ఓవర్: మైక్ కట్ చేసిన పోలీసులు, అశోక్ వాగ్వాదం
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గుడిమల్కాపూర్లో సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలో పోలీసులు సమయం అయిపోయిందంటూ మైక్ కట్ చేశారు. దీంతో ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుకు, వారికి మధ్య వాగ్వాదం జరిగింది. 'రాష్ట్ర విభజనపై జివవోఎంకు చట్టబద్ధత - లోపాలు' అనే అంశంపై శనివారం నిర్వహించిన సదస్సులో అశోక్ బాబు, ఇతరులు మాట్లాడారు. వారికి పోలీసులు సమయం ఇచ్చారు.
అయితే సదస్సు ముగుస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన పోలీసులు టైం అయిపోయిందని, ఆపాలని నిర్వాహకులకు సూచించారు. సమైక్యవాదులు విజ్ఞప్తి చేస్తుండగా మైక్ కట్ చేసేశారు. సదస్సు కోసం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు పోలీస్ అనుమతి ఉంది. ఆ సమయం మించిపోతున్నా వక్తలు ప్రసంగిస్తుండటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వెస్ట్జోన్ డిసిపి సత్యనారాయణ నిర్వాహకులను పిలిచి సదస్సు ముగించాలని కోరారు.

అయినా ప్రసంగాలు కొనసాగిస్తుండటంతో డిసిపి జోక్యం చేసుకుని సభను చాలించాలన్నారు. చెబుతూ మైకులను కట్ చేయించారు. డిసిపి వైఖరికి నిరసనగా సమైక్య వాదులంతా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైకు కట్ చేసిన తరువాత కూడా ప్రసంగాలు కొనసాగించారు.
మరోవైపు సదస్సును భగ్నం చేసేందుకు తెరాస నేతలు ప్రయత్నించడంతో కొంత సేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. మూడు బృందాలుగా వేర్వేరు మార్గాల్లో వచ్చిన తెరాస క్యాడర్ సదస్సు జరుగుతున్న హాలులోకి చొచ్చుకొచ్చారు. సమైక్యవాదులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేయగా, సదస్సులో ఉన్న ఉద్యమకారులూ అంతేస్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి తెలంగాణ నేతలను అదుపులోకి తీసుకొన్న తరువాత.. యథాప్రకారం సదస్సు కొనసాగింది.
కాగా, అంతకుముందు అశోక్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వస్తే మళ్లీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. బిల్లు అసెంబ్లీకి వచ్చిన వెంటనే ప్రతి సీమాంధ్ర ఎమ్మెల్యే ఇంటి ఎదుట ధర్నాకు దిగుతామని వెల్లడించారు. అమెరికా వాల్స్ట్రీట్ ఉద్యమం తరహాలో 'హైదరాబాద్ ఆక్రమణ' పేరిట పది లక్షల మందితో రాష్ట్ర రాజధానిని ముట్టడిస్తామని ప్రకటించారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేస్తే వచ్చే సమస్యల గురించి ఆయన వివరించారు.
రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంత ముఖ్యమంత్రికే తిప్పలు తప్పవని అలాంటప్పుడు సామాన్యుల ఇబ్బందులను ఊహించుకోవచ్చన్నారు. జివోఎం పేర్కొన్న 11 అంశాలలో ఓ ఒక్కటీ పరిష్కారం అయ్యేది కాదని పెదవి విరిచారు. ప్రధానంగా నీళ్లు, రాజధాని, విద్యుత్, హైదరాబాద్ శాంతిభద్రతలు వంటివి చాలా సమస్యాత్మకంగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత కన్నా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే మేలని పునరుద్ఘాటించారు. విభజనను సుప్రీం కోర్టు తప్పక అడ్డుకుంటుందన్నారు.












Click it and Unblock the Notifications