అమరావతి గ్రామాల్లో టెన్షన్:స్వల్ప లాఠీఛార్జ్.. మహిళలకు గాయాలు: యుద్ద వాతావరణం..!
అమరావతి గ్రామాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది. రాజధాని గ్రామాల ప్రజలు ర్యాలీగా విజయవాడకు వెళ్లి..అక్కడ కనకదుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించాలని నిర్ణయించారు. అయితే, పోలీసులు రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ విధించామని..యాక్ట్ 30 అమల్లో ఉందంటూ వారిని అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. అయితే, రైతులు పోలీసులను చేధించుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
వారిని అడ్డుకొనేందుకు తుళ్లూరు..మందడంలో పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్ చేసారు. ముళ్లకంపలు దాటుకొనే వచ్చేందుకు ముందకొచ్చిన మహిళలకు కొందరు గాయపడ్డారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని..అమ్మవారిని దర్శించుకోవటానికి వెళ్లనీయరా అంటూ పోలీసులతో గ్రామస్థులు గొడవకు దిగారు. దీంతో..ఆ గ్రామాల్లో యుద్దవాతావరణం నెలకొని ఉంది.
అమరావతిలో ఉద్రిక్తత..
రాజధాని గ్రామాలైన మందడం, తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ కనకదుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమైన రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులను లాఠీలతో చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు.
గ్రామాల సరిహద్దుల్లో ముళ్ల కంచెలు ఏర్పాటు చేసారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో పలువురు మహిళా రైతులకు గాయాలయ్యాయి. పోలీసుల వలయాన్ని అడ్డుకుని ప్రజలు ముందుకు వెళ్తున్నారు. మహిళలను అడ్డుకుంటున్న పోలీసులను వారించేందుకు రైతలు అడ్డు వచ్చారు.వారిని పోలీసులు తమ వాహనాల్లో తరలించారు.
మహిళల ఆగ్రహ:..పోలీసులతో వాగ్వాదం..
రాజధానిలో పోలీసుల తీరుపై మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏపీలో ఉన్నామా.. పాకిస్థాన్లో ఉన్నామా అని ప్రశ్నిస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చినందుకు తమను శిక్షిస్తారా అని మండిపడ్డారు. మహిళలు అని కూడా చూడకుండా లాఠీచార్జ్ చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుళ్లూరు..మండదం..ఉద్దండరాయుని పాలెంతో సహా రాజధాని పరిధిలోని గ్రామాల మహిళలు ముందుగానే ఏ రకంగా విజయవాడ వెళ్లాలనే దాని పైన కార్యాచరణ సిద్దం చేసుకున్నారు.
అయితే, ఈ రోజు ఉదయాన్నే పోలీసులు పలువురు రైతులను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో పోలీసులు ఎక్కడా ధర్నాలకు..సభలకు అనుమతి మాత్రం ఇవ్వటం లేదు.
విజయవాడలోనూ ముందస్తు అరెస్ట్ లు..
విజయవాడలో జేఏసీ కార్యాలయంగా ఏర్పాటు చేసుకున్న కళ్యాణ మండపానికి పోలీసులు తాళం వేసారు. అక్కడకు వచ్చిన ఎమ్మెల్సీ అశోక్ బాబును అరెస్ట్ చేసారు. ఎంపీ కేశినేని నానితో సహా మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమాతో సహా పలువురు జేఏసీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసారు.
రాజధాని గ్రామాలతో పాటుగా విజయవాడ నగరంలో 144 సెక్షన్ తో సహా యాక్ట్ 30 అమల్లో ఉందని..ఎటువంటి ర్యాలీలకు నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఆంక్షలకు వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.