10th Result: తెలుగు రాష్ట్రాల్లో మేలో పదో తరగతి ఫలితాలు..!
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు మే రెండో వారంలో విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని పదోతరగతి పరీక్షా కేంద్రాలను గురువారం తనిఖీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో 6.64లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుందని తెలిపారు. ఇందులో 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు పాల్గొంటారని పేర్కొన్నారు.

వాల్యుయేషన్ అనంతరం కార్యక్రమాలు పూర్తి చేసి మే రెండో వారంలో విద్యాశాఖ మంత్రి అనుమతితో పది ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇటు తెలంగాణలో గురువారంతో పదో తరగతి పరీక్షలు ముగిశాయి. ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ ప్రారంభమై 11 తేదీనే ముగియగా.. 12, 13 తారీఖుల్లో సంస్కృతం, అరబిక్ పరీక్షలు నిర్వహించారు.
ఫలితాలను ఆలస్యం చేయకుండా త్వరితగతిన విద్యార్థులకు అందించడానికి జవాబు పత్రాల మూల్యాంకనానికి హనుమకొండ కాజీపేట ఫాతిమనగర్లోని ఫాతిమా ఎయిడెడ్ బాలికల ఉన్నత పాఠశాల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ రోజు నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా మొదలు పెట్టారు. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 21వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూల్యాంకనం నిర్వహిస్తారు. మూల్యాంకనానికి చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 950 మంది, ప్రత్యేక అసిస్టెంట్లు 350 మందిని నియమించారు.
ఇప్పటికే హనుమకొండ జిల్లా కేంద్రానికి 2.90 లక్షల పదో తరగతి జవాబు పత్రాలు చేరాయి. పది స్పాట్ వాల్యుయేషన్ అధికారిగా జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎండీ అబ్దుల్హై వ్యవహరిస్తున్నారు. మే 10 తర్వాత అంటే నెల రోజుల్లోపు ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications