పుత్తూరులో నెల రోజులుగా మాటు: తిరుమలనే టార్గెట్?
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న పుత్తూరు తిరుమలకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. తమిళనాడులోని తిరువళ్లూరులో పట్టుబడిన ఉగ్రవాది ఫక్రుద్దీన్ ఇచ్చిన సమాచారం మేరకు పుత్తూరులోని ఓ ఇంట్లో మాటు వేసిన ఉగ్రవాదులను పట్టుకోవడానికి తమిళనాడు పోలీసులు శనివారం తెల్లవారు జామునే ఆపరేషన్ ప్రారంభించారు.
ఫక్రుద్దీన్ ఇచ్చిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్రమత్తంగా ఉండాలని శనివారం ఉదయమే తిరుమలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు పుత్తూరులో నెల రోజుల క్రితం ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నట్లు తెలుస్తోంది.
ఉగ్రవాదులను పట్టుకోవడానికి దాదాపు 11 గంటల పాటు ఆపరేషన్ జరిగింది. పాత దుస్తులు, కోళ్ల వ్యాపారం పేరుతో వారు పుత్తూరులో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులకు ఇంటిని అద్దెకు ఇచ్చిన వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పొట్ట కూటి కోసం వచ్చామని చెప్పడంతో ఇంటిని అద్దెకు ఇచ్చామని, వారు ఉగ్రవాదులని తెలియదని అతను అంటున్నాడు.