అర్ద్రరాత్రి నుండి అరెస్ట్ లు: పోలీసు వలయంలో అమరావతి: టెన్షన్..టెన్షన్..!
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా అడుగడుగునా పోలీసులు కనిపిస్తున్నారు. టీడీపీ..అమరావతి జేఏసీ ఛలో అసెంబ్లీ..జైల్ భరోకు పిలుపునివ్వటంతో పోలీసులు భారీగా మోహరించారు. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు యాక్టివ్ గా ఉంటే టీడీపీ నేతలను ముందస్తు అరెస్ట్ చేసారు. అమరావతి పరిసరాల్లో దాదాపు పది వేల మందితో భద్రత ఏర్పాటు చేసారు. ఇప్పటికే నేతలు..స్థానికులకు పోలీసులు ముందస్తుగానే నోటీసులు జారీ చేసారు. రాజధాని గ్రామాల్లో ఆంక్షలు విధించారు. ప్రతీ దారిలోనూ పోలీసులు భారీగా కనిపిస్తున్నారు. ప్రకాశం బ్యారేజి మీద సామాన్యలు రాకపోకల పైన నిఘా పెట్టారు. విజయవాడలో టీడీపీ నేత లను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. షాడో టీంలు తిరుగుతున్నాయి. ఇక, అసెంబ్లీ ప్రాంగణంలోనూ ముందస్తు చర్యలు చేపట్టారు.
శ్రీకాకుళం నుండి చిత్తూరు దాకా..
రాజధాని ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. అసాధారణ స్థాయిలో సచివాలయం, అసెంబ్లీ వద్ద పోలీసులు... అక్కడికి వెళ్లే ప్రతి దారిలోనూ భారీగా బలగాలు మోహరించాయి. కరకట్టపైన చెక్పోస్టులు పెట్టి ప్రతి కదలికపైనా నిఘా ఏర్పాటు చేసారు. రాజధానిలోని ప్రతి గ్రామంలోనూ పెద్ద సంఖ్యలో దిగిపోయిన పోలీసులు... ప్రతి వీధిపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. సీడ్ యాక్సిస్ రోడ్డు, మందడం, మల్కాపురం జంక్షన్, సచివాలయం ప్రధాన రహదారి, వెలగపూడి గ్రామాల్లో లాఠీలు, తుపాకులు, ఇనుప కంచెలతో పహరా కాస్తున్నారు. సీతానగరం లోటస్ ఫుడ్, కరకట్ట మార్గం, ఉండవల్లి కూడలి, ఉండవల్లి గుహాలయాలు, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, పెనుమాకలకు భారీగా పోలీసులను తరలించడంతో టెన్షన్ వాతావరణ నెలకొంది. ముందస్తు చర్యల్లో భాగంగా నోటీసులు ఇచ్చిన పోలీసులు..శ్రీకాకుళం నుండి చత్తూరు వరకు పలువురు టీడీపీ నేతలను ముందస్తు అరెస్ట్ చేసారు.
పదివేల మంది పోలీసులో భద్రత
రాజధాని గ్రామాల్లో పోలీసులు డ్రోన్లతో నిఘా పెట్టి... అనుమానితులు కనిపిస్తే వెంటనే కంట్రోల్ రూముకు సమాచారం చేరవేస్తున్నారు. ముట్టడి కోసం వచ్చే వారిని గుంటూరు, బెజవాడలోనే అడ్డుకునేలా మఫ్టీలో పోలీసులు నిఘా వేశారు. రాజధాని రోడ్లపై కనిపించిన ప్రతి వ్యక్తినీ, విజయవాడ, గుంటూరు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో దిగే ప్రయాణికులను సైతం అడ్రస్ కోసం ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, వెయ్యి మంది పోలీసు లతో సచివాలయానికి మూడంచెల భద్రత కల్పించారు. అధికారిక సమాచారం ప్రకారం భద్రత విధుల కోసం మొత్తం పది వేల మందిని ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్నా అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.
వేకువ జాము నుంచే హౌస్ అరెస్ట్ లు..
రాజధాని ప్రాంతానికి జేఏసీ..టీడీపీ నేతలు చేరుకోకుండా పోలీసులు నిఘా కట్టుదిట్టం చేసారు. రాజధాని పరిధిలోని ఆయా గ్రామాల్లోని ఇళ్ల పైనా నిఘా పెట్టారు. ఎవరైనా నిరసనల కోసం బయటికి వస్తే గ్రామ శివారులో అదుపులోకి తీసుకుంటారు. విజయవాడ నుంచి తాడేపల్లి వైపు వెళ్లే సామాన్య ప్రజానీకాన్ని నిలిపివేసారు. ఆయా గ్రామాల వ్యక్తులను సైతం అనుమతించకుండా మరో మార్గం ఎంచుకోవాలని సూచించారు. ఇక, ముఖ్యమంత్రి నివాసం నుండి సచివాలయం వరకు కొత్తగా సిద్దం చేసిన మార్గంలో కాన్వాయ్ వెళ్లనుంది. ఇప్పటికే ఈ మేరకు ట్రయిల్ నిర్వహించారు. దీంతో..రాజకీయంగానే కాదు.. ఆందోళన ల నడుమ అమరావతి గ్రామాల్లో టెన్షన్ వాతవారణం కనిపిస్తోంది.