కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడతారేమో..: టిజి వెంకటేష్
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం ఆలోచిస్తానని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే చాలా మంది కాంగ్రెసు పార్టీని వీడుతారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఇప్పటికైతే తాను ఏ పార్టీలోనూ చేరబోనని ఆయన అన్నారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పినవన్నీ జరగడం లేదని, తాము దిగ్విజయ్ సింగ్ను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
పార్టీల అధినేతలందరూ సీమాంధ్ర కొంప ముంచారని, రాజకీయ పార్టీల అధినేతలు అధికారం కోసం మాత్రమే చూస్తున్నారని ఆయన అన్నారు. రాయలసీమ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందని ఆయన అన్నారు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు తమ అధినేతలను పక్కన పెట్టి ఒకే వేదిక మీదికి వచ్చి ఢిల్లీని స్తంభింపజేయాలని, విభజనకు స్పీడ్ బ్రేకులు వేస్తేనే ఫలితం ఉంటుందని ఆయన అన్నారు.
అనివార్యమైతే సొంత పార్టీ పెట్టాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని, ముఖ్యమంత్రి సొంత పార్టీ పెడతారేమో చెప్పలేమని ఆయన అన్నారు. గెలిచే అవకాశం ఉంటే ఎవరు కూడా పార్టీని పెట్టే అవకాశాన్ని వదులుకోబోరని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు మాత్రమే అధిష్టానాన్ని వ్యతిరేకిస్తున్నారని, మిగతా పార్టీల నాయకులు అధిష్టానాన్ని వ్యతిరేకించడం లేదని ఆయన అన్నారు.
సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని, రాజీనామాల చుట్టూ తిరగడం మానేసి కార్యాచరణను రూపొందించుకోవాలని ఆయన అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును వ్యతిరేకించడానికి ఎంపీలు పదవుల్లో కొనసాగడం అవసరమని ఆయన అన్నారు. అసెంబ్లీ తెలంగాణ ముసాయిదా బిల్లు మాత్రమే వచ్చేలా ఉందని ఆయన అన్నారు.
అన్ని పార్టీల అధినేతలు తమను మోసం చేశారని, తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తే లక్ష మందితో ఢిల్లీని ముట్టడించాలని ఆయన అన్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలను ఒకే వేదిక మీదికి తేవడానికి ప్రయత్నాలు చేస్తానని ఆయన చెప్పారు.