తిరుమల కిటకిట: శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..?
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. సెలవురోజు కావడం వల్ల శనివారం నాడు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. నేడు కూడా రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు భక్తల సంఖ్య కొంతమేర తగ్గినప్పటికీ.. మళ్లీ పుంజుకొంది.
శుక్రవారం 62,625 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 34,462 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.63 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లూ నిండిపోయాయి. భక్తులతో కిటకిటలాడాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పట్టింది. క్యూలైన్లు, కంపార్లమెంట్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీళ్లు, పాలు పంపిణీ చేశారు. శ్రావణ మాసంలో విశేష పూజలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
కాగా శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు శనివారం పూర్ణాహుతితో ముగిశాయి. ఈ నెల 15వ తేదీన ఈ ఉత్సవాలు ఆరంభమైన విషయం తెలిసిందే. ముగింపు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం యాగశాలలో హోమాలను నిర్వహించారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చేపట్టారు.

ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా చందనం పూత పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. ఆ తరువాత పూర్ణాహుతి నిర్వహించారు.
శ్రీ మలయ్పప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ కారణంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో వాటిని పునరుద్ధరించనున్నారు.












Click it and Unblock the Notifications