మద్దతు ధర విషయంలో రాష్ట్రాల ప్రతిపాదనలు కేంద్రం పట్టించుకోలేదు:మంత్రి సోమిరెడ్డి
అమరావతి: వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించే సమయంలో రాష్ట్రాల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.
రైతు పెట్టుబడిపై 50 శాతం ఆదాయం వచ్చేలా మద్దతు ధర ఇస్తామన్నారని...అయితే పంటల ఉత్పత్తి వ్యయాన్ని బాగా తక్కువగా లెక్కించారని మంత్రి సోమిరెడ్డి ఆరోపించారు. కనీస మద్దతు ధర ఉన్నా జొన్న, మొక్కజొన్న పంటలనూ కొనడం లేదని మంత్రి వెల్లడించారు. స్వామినాథన్ సిఫార్సులను పూర్తిగా పక్కన పెట్టారని తెలిపారు.
కేంద్రం ఇవన్నీ చేస్తుంటే జగన్, పవన్ కళ్లకు కనబడటం లేదా?...అని మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు. అయినా కేంద్రం అఫిడవిట్ ఇస్తే నిలదీయాల్సింది కేంద్రాన్ని గాని చంద్రబాబును కాదని అన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మెరుగైన చర్యలను చేపట్టిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివరించారు.
Recommended Video
మరోవైపు టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం గుజరాత్ నుంచి పూర్తి స్థాయిలో కేంద్రం ఆహార ధాన్యాలు కొనుగోలు చేస్తోందని, ఏపీకి మాత్రం మొండి చెయ్యి చూపిస్తోందని ఆరోపించారు. వైసిపి అధినేత జగన్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లపై విమర్శనాస్త్రాలు సంధించారు. వీరిద్దరూ బీజేపీతో కుమ్మక్కై ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.