సీఎం జగన్ కు కేంద్రం షాక్ - పోలవరం పై తేల్చేసారు : ముఖ్యమంత్రి సమర్ధతకు పరీక్షగా..!!
కేంద్రంతో సఖ్యతగా ఉంటూ..వారికి అవసరమైన ప్రతీ సందర్బంలోనూ మద్దతిస్తున్నా.. వైసీపీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో మాత్రం సహకారం అందటం లేదు. పోలవరం సవరించిన అంచనాల కోసం సీఎం జగన్ తో సహా రాష్ట్ర ప్రతినిధులు..అధికారులు రెండున్నారేళ్లుగా కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతీ సందర్బంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్పటికి చూస్తాం..చేస్తాం అని చెప్పటం మినహా.. వారి పాత వాదనకే కేంద్రం కట్టుబడి ఉన్నట్లుగా స్పష్టం అవుతోంది.
జగన్ పదే పదే కోరినా కేంద్రం మాత్రం
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2013-14 అంచనా వ్యయం రూ 20,398.61 కోట్లకు మంచి ఇవ్వబోమని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు..బోర్డుల వ్యవహారం పై చర్చల కోసం ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు కేంద్ర జలశక్తి అధికారులతో సమావేశమయ్యారు. ఆ సమయంలో..పోలవరం అంశం పైనా చర్చకు వచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు రూ 47,725.74 కోట్లకు క్లియరెన్స్ ఇవ్వాలని.. జాతీయ హోదా ప్రాజెక్టులన్నింటికీ ఆమోదిస్తున్న తరహాలోనే ఇందులోనూ తాగునీటి పధకానికి రూ 4,400 కోట్లు వ్యవయానికి ఆమోదం తెలపాలని కేంద్ర అధికారులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
పాత వాదనకే కట్టుబడిన కేంద్రం
కానీ, కేంద్ర అధికారులు మాత్రం గతంలో వినిపించిన వాదనే తిరిగి చెప్పుకొచ్చారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన రూ 20398.61 కోట్లకు మించి అదనపు వ్యయానికి నిధులు మంజూరు చేయలేమంటూ కేంద్ర అధికారులు స్పష్టంగా వెల్లడించారు. ఇదే సమయంలో క్రిష్ణా - గోదావరి బోర్డుల పరిధిలోని విద్యుత్ కేంద్రాలతో సహా ప్రాజెక్టులను తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. అయితే, రాష్ట్రాలే స్వచ్చందంగా అప్పగించాలని..తామంతటగా తాము తీసుకొనే అవకాశం లేదని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రాజెక్టుల స్వాధీనం పైన క్లారిటీ
ఇదే సమయంలో ప్రాజెక్టుల అప్పగింత పైన తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేయటంతో వారి నిర్ణయం ఏంటో వేచి చూద్దామని చెప్పినట్లు సమాచారం. తెలంగాణతో సంప్రదింపులు జరుపుతున్నామని .. తమంతటగా తాము స్వాదీనం చేసుకోలేమని కేంద్ర జలశక్తి అధికారులు స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు చేపట్టి రెండున్నారేళ్ల కాలం పూర్తవుతోంది. పోలవరం ప్రాజెక్టు తమ పాలనలో ప్రాధాన్యత అంశమని సీఎం పలు మార్లు చెప్పుకొచ్చారు. ప్రాజెక్టు పూర్తి చేయటానికి నిర్దేశిత సమయాన్ని ప్రకటించారు. అయితే, కేంద్రం నుంచి మాత్రం నిధుల అంశం పైన ఇప్పటికీ స్పష్టత రాలేదు.
Recommended Video
టీడీపీ హయాంలోనే నిర్ణయం జరిగిందంటూ
టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయం లోనే దీని పైన కేంద్రం నిర్ణయం తీసుకుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సవరణలు మార్చాలని పదే పదే కోరుతున్నా..కేంద్రం నుంచి మాత్రం హామీలే తప్ప ఆచరణలో అమలు కావటం లేదు. దీంతో..ఇక, ఇప్పుడు జలశక్తి అధికారులు తేల్చి చెప్పటంతో పోలవరానికి నిధుల సాధన సీఎం జగన్ సమర్ధతకు పరీక్షగా మారుతోంది. పోలవరం అంశం రాజకీయంగానూ జగన్ కు కీలకం కానుంది. దీంతో..ఇప్పుడు ముఖ్యమంత్రి పోలవరం నిధుల అంశంలో ఏ రకమైన కార్యాచరణ అమలు చేస్తారు.. కేంద్రంతో ఎలా వ్యవహరిస్తారనేది కీలకంగా మారుతోంది.