సాయిరెడ్డి నిర్ణయం వెనుక, జగన్ తో ఏం జరిగింది - ఢిల్లీ డీల్..!!
వైసీపీ ముఖ్య నేత సాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తాను వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతంగా చెప్పు కుచ్చారు. తాను ఏ పార్టీలో చేరటం లేదని స్పష్టం చేసారు. రేపు రాజ్యసభకు రాజీనామా చేస్తానని వెల్లడించారు. అయితే, సాయిరెడ్డి నిర్ణయం వెనుక పెద్ద వ్యవహారమే నడిచింది. తాడేపల్లి - ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫలితంగా సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెబుతూ నిర్ణయం తీసుకున్నారు.
జగన్ కు ఆప్తుడుగా
వైఎస్ హయాం నుంచి ఆ కుటుంబానికి సాయిరెడ్డి విధేయుడిగా ఉన్నారు. ఛార్టెడ్ ఎకౌంటెట్ గా వైఎస్ విధేయుడిగా ఉంటూ టీటీడీ బోర్డు సభ్యుడిగా, ఓబీసీ బ్యాంకు డైరెక్టర్ గా ఆ తరువాత సాక్షి సంస్థల ను సాయిరెడ్డి పర్యవేక్షించారు. జగన్ కేసుల్లో జైలుకు వెళ్లారు. అయినా, జగన్ తో కలిసి నడిచారు. వైసీపీ నుంచి తొలి రాజ్యసభ సభ్యుడిగా పని చేసారు. వైసీపీలో నెంబర్ టూ స్థానంలో నిలిచారు. 2019 ఎన్నికల్లో గెలుపు... పార్టీ వ్యూహాల్లో కీలకంగా వ్యవహరించారు. కేంద్రంలో బీజేపీ - జగన్ మధ్య వారధిగా వ్యవహరించారు. ప్రధాని మోదీ, అమిత్ షా కు సన్నిహితుడుగా మారారు. కానీ, వైసీపీ 2024 లో ఓటమి తరువాత సమీకరణాలు మారిపోయాయి.

వైసీపీలో కీలకంగా
2024 ఎన్నికలకు ముందే ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ గా ఉన్న సాయిరెడ్డిని ఫిర్యాదుల కారణంగా పార్టీ ఆ బాధ్యతల నుంచి తప్పించింది. తరువాత కొంత కాలంగా సాయిరెడ్డి మౌనంగా ఉన్నారు. ఆ తరువాత ఎన్నికల వేళ యాక్టివ్ అయ్యారు. నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక, పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా సాయిరెడ్డి స్థానంలో వైవీ సుబ్బారెడ్డిని నియమించటం ఆయనకు రుచించ లేదు. సాయిరెడ్డిని రాజ్యసభ పార్టీ నేతగా మాత్రమే పరిమితం చేసారు. ఆ సమయంలోనే బీజేపీ నుంచి సాయిరెడ్డి అండ్ టీం కు ఆఫర్ వచ్చింది. వైసీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారారు. సాయిరెడ్డి తో పాటుగా మరో ముగ్గురుని బీజేపీలోకి రావాలంటూ ఆఫర్ రాగా.. సాయిరెడ్డి సందిగ్ధంలో పడ్డారు.
తప్పని స్థితిలో
ఇటు తాను అంతగా కష్టపడిన పార్టీలో విలువ తగ్గటం .. పట్టించుకోక పోవటం.. అటు ఢిల్లీలో కేంద్రంలో అధికారంలో ఉన్న వారి నుంచి వస్తున్న ఒత్తిడి మధ్య చాలా రోజులుగా సన్నిహితులతో చర్చించారు. జగన్ వద్ద ఈ అంశం పైన చర్చకు వచ్చింది. మంచి రోజులు వస్తాయని.. పార్టీ వీడవద్దని జగన్ సూచించారు. అటు బీజేపీ నేతలతో ఉన్న సంబంధాలతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేని స్థితిలో సాయిరెడ్డి ఉన్నారు. కాగా, ఇక సాయిరెడ్డి బీజేపీలో చేరటం ఖాయమైందనే ప్రచారం ఢిల్లీలో రెండు రోజులుగా జరుగుతోంది. ఈ సమయంలో జగన్ ను కాదనలేక.. అటు బీజేపీలోకి వెళ్లలేక సాయిరెడ్డి ప్రస్తుతానికి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేసారు. 2028 వరకు సాయిరెడ్డికి రాజ్యసభ పదవీ కాలం ఉంది. దీంతో.. ఇప్పుడు సాయిరెడ్డి తన నిర్ణయం మేరకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. మరి..తాను చేసిన ప్రకటన మేరకు ఏ పార్టీలో చేరకుండా ఉంటారా.. రానున్న రోజుల్లో ఏం జరుగుతుంద నేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications