వ్యాఖ్యలపై సిఎంను వివరణ కోరలేదు: దిగ్విజయ్
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తామని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాలను అధిష్టానానికి చెప్పారని ఆయన అన్నార.
ముఖ్యమంత్రి ప్రస్తావించిన విద్యుత్తు, నీరు, తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాదులో నివసిస్తన్న సీమాంధ్రులకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ లేఖలు ఇచ్చారని ఆయన అన్నారు.
అధిష్టానాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రకు తగిన న్యాయం చేస్తామని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహాయం అందిస్తుందని చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన రాజ్యసభ కాంగ్రెసు అభ్యర్థులు కెవిపి రామచందర్ రావు, సుబ్బిరామిరెడ్డి, ఎంఎ ఖాన్లతో సమావేశమయ్యారు. దిగ్విజయ్ సింగ్ను పలువురు మంత్రులు, శాసనసభ్యులు, కాంగ్రెసు నాయకులు కలుసుకున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఏ విధమైన వివరణలు కోరలేదని ఆయన చెప్పారు. సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిశీలిస్తామని, వారి ప్రయోజనాలను కాపాడుతామని ఆయన చెప్పారు.
పదిలోగానే పార్లమెంటులో బిల్లు
కాగా, ఫిబ్రవరి 10వ తేదీలోగా పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతారని పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. ఫిబ్రవరి 15వ తేదీ కన్నా ముందే పార్లమెంటు ఉభయ సభల్లో మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన చెప్పారు. మానవమాత్రులే కాదు, హరహరాదులు అడ్డు వచ్చినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఆపలేరని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏ విధమైన చిక్కులు రావని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ నిర్ణయం నేపథ్యంలో కాంగ్రెసులో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విలీనం సరైన మార్గమని ఆయన అన్నారు.