వైఎస్ షర్మిల సీఎం రేవంత్ రెడ్డితో భేటీ వెనుక మాస్టర్ ప్లాన్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఒకపక్క పార్టీ శ్రేణులను బలోపేతం చేయడంతోపాటు, ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, వైసిపి పాలనను టార్గెట్ చేస్తూ జిల్లాల పర్యటనలలో షర్మిల నిప్పులు చెరుగుతున్నారు.
వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టక ముందు జవసత్వాలు లేకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడిప్పుడే మళ్లీ తన ఉనికిని చాటుకుంటోంది. వచ్చే ఎన్నికలలో బలంగా ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న షర్మిల తాజాగా వేస్తున్న అడుగులు ఆసక్తిని కలిగిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు.

పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన షర్మిల ఆయనతో అనేక రాజకీయపరమైన అంశాలపై మాట్లాడారు. త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న క్రమంలో వైయస్ షర్మిల తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డిని ఏపీలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సహకరించాలని కోరినట్టు సమాచారం. అంతేకాదు పార్టీకి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ కోసం కూడా రేవంత్ రెడ్డితో చర్చలు జరిపినట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతానని శపథం చేసిన వైఎస్ షర్మిల ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో వైసీపీని చావు దెబ్బ కొట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై రేవంత్ రెడ్డి తో చర్చించినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజల్లోకి బలంగా వెళ్లడానికి తెలంగాణ రాష్ట్రంలో ఫాలో అయిన సక్సెస్ మంత్ర ఏమిటి అన్న దానిపైన కూడా రేవంత్ రెడ్డితో చర్చించినట్టు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రం నుంచి కావలసిన మద్దతును కాంగ్రెస్ పార్టీకి తీసుకునే క్రమంలో షర్మిల ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా వైయస్ షర్మిల రేవంత్ రెడ్డితో భేటీ కావటం రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.












Click it and Unblock the Notifications