పులకించిన తిరుమలగిరులు..!!
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 64,983 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,324 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.49 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 26 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లల్లో వేచివున్న భక్తులకు సేవకులు అల్పాహారం, మంచినీరు, పాలు అందజేశారు.

పవిత్ర కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 17 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు టీటీడీ అర్చకులు. వేదమంత్రోచ్ఛారణలతో తిరుమలగిరులు పులకించాయి.
మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవ మూర్తులకు పట్టు వస్త్రాభరణాలతో అలంకరించి వేదమంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు పుష్ప కైంకర్యం చేశారు.
చామంతి, సంపంగి, నూరు వరహాలు, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు.
పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేశారు. 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు. పుష్పయాగానికి మొత్తం తొమ్మిది టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు విరాళంగా అందించారు.












Click it and Unblock the Notifications