పెద్దిరెడ్డి అడ్డాలో షాక్, అర్దరాత్రి ఇండోర్ స్టేడియం నేలమట్టం, జేసీబీలతో ధ్వంసం
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సొంత నియోజక వర్గం పుంగనూరులో ఇండోర్ షటిల్ కోర్టు స్టేడియాన్ని రాత్రికి రాత్రి కూల్చేయడం కలకలం రేపుతోంది. ముంబాయి- చెన్నై జాతీయ రహదారి సమీపంలోని (మదనపల్లె రోడ్డు) షటిల్ ఇండోర్ స్టేడియాన్ని అర్దరాత్రి జేసీబీలతో కూల్చేడంతో పుంగనూరు ప్రజలు ఉలిక్కిపడ్డారు. అయితే ఇండోర్ స్టేడియాన్ని ఎవరు కూల్చేశారు ? అనే విషయం అంతు చిక్కడం లేదని క్రీడాకారులు అంటున్నారు.
ఇరవై ఏళ్ల కిందట పుంగనూరు పట్టణానికి చెందిన కొందరు ప్రముఖులు ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. తరువాత పుంగనూరులోని కొత్తఇండ్లు ప్రాంతంలో షటిల్ ఆడటం ప్రారంభించారు. ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ను అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన క్రీడాకారులు కొత్తఇండ్లు సమీపంలోని 17 సెంట్ల ప్రభుత్వ భూమిని ఇదే అసోసియేషన్ సభ్యులు గుర్తించారు.

2004లో ప్రభుత్వ భూమిలో షటిల్ కోర్టు భవనం నిర్మాణం కోసం అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి తహసిల్దారు షటిల్ కోర్టు కోసం అనుమతి ఇచ్చారు. మొదటి విడతలో రూ. 30 లక్షలతో ఇండోర్ కోర్టు, ఆ తర్వాత ఉడెన్ కోర్టు, ఇతర సామాగ్రి కోసం రూ. 50 లక్ష్లలు వెచ్చించారు. ఇంతకాలం పుంగనూరులోని షటిల్ క్రీడాకారులు ఇదే ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుతున్నారు.
ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూట ఇదే ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుతున్నారు. ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుతున్న వారిలో అధిక శాతం మంది వివిద శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లు ఎక్కువగా ఉన్నారు. షటిల్ ఇండోర్ స్టేడియం అసోషియేషన్ చైర్మన్ గా చరణ్ పని చేస్తున్నారు. ముందు రోజు రాత్రి కూడా ఇదే ఇండోర్ స్టేడియంలో కొందరు షటిల్ ఆడిన తరువాత ఇంటికి వెళ్లిపోయారు.

అర్దరాత్రి దాటిన తరువాత జేసీబీ యంత్రాలతో అక్కడికి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు మొదట ఇండోర్ స్టేడియం దగ్గర ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు మొత్తం ధ్వంసం చేశారు. ఆ తరువాత షటిల్ ఇండోర్ స్టేడియం మొత్తం నేలమట్టం చేసిన నిందితులు జేసీబీ యంత్రాలతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు షటిల్ ఆడటానికి అక్కడికి వెళ్లిన క్రీడాకారులు ఇండోర్ స్టేడియం నేలమట్టం అయిన విషయం గుర్తించి హడలిపోయారు.

షటిల్ ఇండర్ స్టేడియం నేలమట్టం అయిన విషయం పుంగనూరు మొత్తం వ్యాపించడంతో వందలాది మంది కొత్తఇండ్లు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న చిత్తూరు మాజీ ఎంపీ, వైసీపీ సీనియర్ నాయకుడు ఎన్ రెడ్డప్ప సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి క్రీడాకారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. తరువాత అసోషియేషన్ ఛైర్మన్ చరణ్ ఆధ్వర్యంలో క్రీడాకారులు, వైసీపీ నాయకులు పలమనేరు డీఎస్పీ విష్ణు రఘువీర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇండోర్ షటిల్ స్టేడియం ఉన్న పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి వివరాలు తెలుసుకుంటున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications