బాబును చుట్టుముడుతున్న విచిత్ర పరిణామాలు..! కూటమి గెలిస్తేనే కాంగ్రెస్ తో సఖ్యత..!!
హైదరాబాద్:బీజేపి వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగంగా ఏపీ సీయం చంద్రబాబు వేస్తున్న అడుగులు గమ్యం చేరతాయా..? జాతీయ స్థాయిలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు లక్ష్యాన్ని సాదిస్తాయా..? సేవ్ ఇండియా, సేవ్ డెమాక్రసీ పేరుతో బాబు జరుపుతున్న మంతనాలు ఫలప్రదం అవుతాయా...? బీజేపిని గద్దె దించేందుకు కాంగ్రెస్ తో దోస్తీ కట్టి సాహసోపేత నిర్ణయం తీసుకున్న చంద్రబాబుకు అనుకున్న ఫలితాలు వస్తాయా..? తెలంగాణలో మహాకూటమి విజయం సాదించకపోతే కాంగ్రెస్ తో బాబు సఖ్యత కొనసాగుతుందా..! ఒక స్నేహం వంద శత్రుత్వాలకు దారి తీయనుందా.? చంద్రబాబు చుట్టూ అల్లుకుంటున్న విచిత్ర రాజకీయ పరిణమాలే కాకుండా ఏపి తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
చంద్రబాబు కు ఏపిలో గడ్డ కాలం..! ఎన్నికల నాటికి వ్యతిరేకత పెరుగుతుందా..?తగ్గుతుందా..?
రాబోయే ఎన్నికల సందర్బంగా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కష్టాలు తప్పేలాలేవనే వార్తలు వినిపిస్తున్నాయి. 2019 ఏపీ ఎన్నికల్లో 120 పైచిలుకు స్థానాలు సాధిస్తామని టీడీపీ చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు అనువుగా లేవని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ నియోజకవర్గాల నుంచి టీడీపీకి 40 నుంచి 45 శాతం మేరకు మాత్రమే మద్దతు లభిస్తోందని వివిధ సర్వేల నివేదికలు తేటతెల్లం చేసాయి. అలాగే అన్నిచోట్ల నుంచి వైసీపీ తో గట్టి పోటీ తప్పదని కూడా తెలుస్తోంది. మిగిలిన పార్టీల ఓట్ల చీలికతో సంబంధం లేకుండా ఈ సర్వేలు నిర్వహిస్తున్నారని సమాచారం. రాయలసీమలో వైసీపీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని, ప్రస్తుతం 72 స్థానాల్లో వైసీపీకి మద్దతు లభిస్తున్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.
తెలంగాణలో కూటమి ఓడిపోతే విపత్కర పరిణామాలు..! నిస్సహాయ స్థితిలోకి బాబు..!!
దీనిని చూస్తుంటే ఎన్నికల నాటికి ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరిగే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నారు. దాంతో ప్రభుత్వవ్యతిరేక ఓటు వైసీపీ వైపు మరలకుండా చూసేందుకు తెలుగుదేశం అన్నిరకాల ప్రయత్నాలు సాగిస్తున్నదని సమాచారం. అందుకే కాంగ్రెస్ కు టీడీపీ మద్దతు పలుకుతున్నదనే వాదన వినిపిస్తోంది. జనసేన బలపడితే టీడీపీ ఓట్లలో చీలిక వస్తుందని, అదే కాంగ్రెస్ బలపడితే వైసీపీ ఓట్లకు గండిపడుతుందనే అంశం సర్వేలలో వెల్లడవుతోందట. ఇంతవరకూ టీడీపీ నిర్వహించిన సర్వేల్లో జనసేనకు 7% వరకూ ఓట్లు వస్తాయని వెల్లడికాగా, కాంగ్రెస్ ఓటింగు 2%గానే తేలిందట. అందుకే టీడీపీ కాంగ్రెస్ ను బలపరిచి లబ్దిపొందాలని ప్రణాళికలు రచిస్తోంది.
తెలంగాణలో కూటమి గెలిస్తేనే బాబు మనుగడ..! ప్రతిస్టాత్మకంగా తీసుకుంటున్న శ్రేణులు..!!
టీడీపికి తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు ఫలించి, అనుకున్నన్ని అసెంబ్లీ స్థానాలు దక్కించుకోగలిగితే టీడీపీ వ్యూహం పూర్తిగా మారిపోనున్నదని తెలుస్తోంది. దీంతో ఏపీలోనూ కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు ఆటంకాలు వీడిపోతాయనే అంచనాలున్నాయి. దీనికితోడు మోదీని ఎదుర్కోవాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ తెలంగాణలో టీడీపీ విజయం సాధించకపోతే కాంగ్రెస్ తో పొత్తు వ్యవహారం ముందుకు సాగకపోవచ్చనే అంచనాలున్నాయి.
తెలంగాణ కూటమితో ముడిపడ్డ అనేక పరిణామాలు..! బాబు భవితవ్యాన్ని తేల్చనున్న టీ పోల్స్..!!
అయితే పొత్తుకొనసాగితే పీసీసీ అద్యక్షుడు రఘువీరాతోపాటు 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలున్నాయని సర్వేలు చెబుతున్నాయట. టీడీపీ సహకారం లేని పక్షంలో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని సర్వేల ద్వారా తెలుస్తోంది. అందుకే ఏపీలోని కాంగ్రెస్ నేతలు టీడీపీతో పొత్తును స్వాగతిస్తున్నారని సమాచారం. అలాగే వారంతా తెలంగాణలో విజయం దక్కితే ఏపీలో తమకు పునర్ వైభవం లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ పొత్తుల వ్యవహారం స్నేహపూర్వక కూటమి విజయం సాదిస్తే మరింత బలపడే అవకాశాలు ఉన్నయని తెలుస్తోంది.