ఆన్ లైన్ లో టిటిడి క్యాలెండర్లు, డైరీల బుకింగ్ అవకాశం...ఇలా ఇదే మొదటిసారి...
తిరుపతి: తిరుపతి ఏడుకొండలస్వామి భక్తులకు ఇది శుభవార్త...స్వామి వారి క్యాలండర్లు, డైరీలు కావాలని కోరుకునేవారు, వీటి కోసం ప్రయత్నించినా దొరకక నిరాశ చెందేవారికి టిటిడి సదవకాశం కల్పించింది. ఆ చక్కటి అవకాశం ఏమిటంటే...తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్లు, డైరీలను మొదటిసారిగా భక్తులకు అంతర్జాలంలో బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.
తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో అంతర్జాల బుకింగ్ను టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రారంభించారు. ఆన్ లైన్ లో టిటిడి క్యాలండర్లు, డైరీలు బుక్ చేసుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు. టిటిడి వెబ్సైట్లో పబ్లికేషన్స్ను క్లిక్ చేసి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల ద్వారా క్యాలండర్లు,డైరీలకు ఆర్డరు చేయవచ్చని తెలిపారు. అయితే తపాల ఛార్జీలు భక్తులే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.అలాగే ఫ్లిఫ్కార్ట్ ద్వారా కూడా వీటిని కొనుగోలు చేయొచ్చన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న తితిదే సమాచార కేంద్రాలు, ముఖ్య నగరాల్లో వీటిని అందుబాటులో ఉంచామని తెలిపారు.
మరోవైపు శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీని నిత్యం తయారవుతోంది 3 లక్షలు కాగా వీటి సంఖ్య 4 లక్షలకు పెంచాలని టిటిడి నిర్ణయించింది. తిరుమల జేఈవో శ్రీనివాసరాజు నేతృత్వంలో గురువారం సమావేశమైన అధికారులు ఈ లడ్డూల తయారీ పెంపు నిర్ణయించారు.
ఇటీవల ఉన్నతాధికారులు చెన్నై వెళ్లి అక్కడి మెషినరీ పరిశీలించారు. వీటిని కొనుగోలు చేసే ముందు చెన్నైలోనే ప్రయోగాత్మకంగా బూందీ తయారు చేసి చూడాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి అదనంగా తయారుచేయాలని అనుకుంటున్నలక్ష లడ్డూలు ఉన్న మానవ వనరులతోనే ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించారు.