తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ - ముహూర్తం ఫిక్స్ : ఈ రెండు స్టేషన్ల మధ్య ..!!
Vande Bharat: దేశంలో దూసుకుపోతున్న వందే భారత్ రైలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పట్టాలెక్కనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు అధికారిక సమాచారం అందింది. ఇప్పటికే విశాఖ కేంద్రంగా వందేభారత్ రైలును కేటాయిస్తూ స్వయంగా రైల్వే మంత్రి ప్రకటన చేసారు. తాజాగా.. రైల్వే బోర్డు నుంచి దక్షిణ మధ్య రైల్వే కు వందేభారత్ ను కేటాయిస్తూ సందేశం పంపారు. ఈ నూతన రైలును సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య నడపాలని నిర్ణయించారు. దీంతో, ఇప్పటికే రద్దీగా ఉంటున్న సికింద్రాబాద్ - విజయవాడ లైన్ లో వందేభారత్ ద్వారా మరింత వెసులుబాటు కలగనుంది.

వందేభారత్ పై అధికారిక నిర్ణయం
సికింద్రాబాద్ నుంచి విశాఖ మధ్య వందేభారత్ రైలు పైన అధికారిక నిర్ణయం వెలువడింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు వందేభారత్ రైళ్లు ప్రారంభించారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఆరో రైలు ప్రారంభం కానుంది. ప్రస్తుతం వందేభారత్ రైళ్లు సిట్టింగ్ సీట్లతో నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన వందేభారత్ రైలు సికింద్రబాద్ నుంచి విజయవాడ వరకు నడవనుంది. త్వరలో వందేభారత్ లోనూ బెర్తు లతో ఉన్న బోగీలు అందుబాటులోకి రానున్నాయి. అప్పుడు ఇదే రైలును సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖ వరకు పొడిగించనున్నారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మద్య కాజీపేట మార్గంలో ట్రాక్ గరిష్ఠ వేగ సామర్ధ్యం గంటకు 130 కిలో మీటర్లుగా ఉంది.

సికింద్రాబాద్ టూ విజయవాడ
మరో లైన్ సికింద్రాబాద్ - గుంటూరు వయా నల్గొండ మార్గంలో గరిష్ఠ వేగం 110 కిలో మీటర్లుగా ఉంది. వందేభారత్ కోసం ట్రాక్ సామర్ధ్యాన్ని 180 కిలో మీటర్ల గరిష్ఠ వేగానికి పెంచాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నెలలోనే సికింద్రబాద్ - విజయవాడ మధ్య వందేభారత్ రైలు ప్రారంభించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ రైలులో అన్నీ ఏసీ బోగీలు ఉంటాయి. అయితే, ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విజయవాడ కు పలు రైళ్లు నడుస్తున్నాయి. రెండు మార్గాల్లో వీటిని కొనసాగిస్తున్నారు. కానీ, రద్దీ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వెళ్లే రైళ్లు సికింద్రాబాద్ మీదుగా విజయవాడ చేరకొని అక్కడ నుంచి గమ్యస్థానాలకు వెళ్తున్నాయి. ఇప్పుడు వందలాది రైళ్లకు విజయవాడ జంక్షన్ గా ఉంటోంది.

త్వరలో విశాఖ వరకు పొడిగింపుకు నిర్ణయం
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వెసులుబాటు కల్పించేందుకు ముందుగా ఈ లైన్ లో వందేభారత్ నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. విశాఖ వరకు దీనిని కొనసాగించాలని ముందు ప్రతిపాదించారు. అయితే, ట్రాక్ సామర్ధ్యం.. ఇప్పటికే కొనసాగుతున్న రైళ్లు.. రద్దీని పరిగణలోకి తీసుకొని ముందుగా విజయవాడ వరకు నడపాలని డిసైడ్ అయ్యారు. వచ్చే ఏప్రిల్ నుంచి వందేభారత్ ను సికింద్రాబాద్ నుంచి విశాఖ వరకు కొనసాగించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇప్పటికే జన్మభూమి లో సిట్టింగ్ కోచ్ లతోనే సికింద్రాబాద్ నుంచి విశాఖ వరకు నడుపుతున్నారు. వందేభారత్ ను అందుబాటులోకి తేవటం ద్వారా ఇదే మార్గంలో త్వరిత గతిన మరింత సౌకర్యవంతంగా సికింద్రాబాద్ నుంచి విశాఖ వరకు ప్రయాణం అందుబాటులోకి రానుంది.












Click it and Unblock the Notifications