అమ్మాయిలను అక్రమంగా జాంబియా తరలింపు
మదనపల్లి, పీలేరు కేంద్రంగా సాగుతున్న ఉమెన్ ట్రాఫికింగ్ స్థానికంగా పెను సంచలనం కలిగించింది. ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను విదేశాలకు తరలిస్తూ ఒక ముఠా సొమ్ము చేసుకుంటోంది. మదనపల్లికి చెందిన రేష్మా, ఆమె కూతురు సమ్రిన్ను అక్రమంగా జాంబియా తరలించారు. బాధితుల ఫిర్యాదుతో ఈ ముఠా గుట్టు రట్టయ్యింది. నిందితులు సల్మా, వినోద్తో పాటు మరో ఇద్దరిపై మదనపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. చాలా మంది యువతులను జాంబియాకి తరలించి వేధించినట్లు ఓ బాధితురాలు వెల్లడించింది.
నానా కష్టాలు పడి సొంతూరుకు తిరిగొచ్చిన తనపై సల్మా, వినోద్ వేధింపులకు పాల్పడుతున్నారని వాపోయింది. జాంబియా తిరిగి వెళ్లాలని, లేదంటే న్యూడ్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ముఠాపై పుంగనూరు, పీలేరుతో పాటు హైదరాబాద్లోనూ కేసులున్నట్లు గుర్తించారు.
దేశంలో బలహీన వర్గాలకు చెందిన ప్రజలు, ప్రధానంగా మహిళలు మానవ అక్రమ రవాణాకు గురవుతున్నారు. ఏటా 40,000 మంది బాలలు కనిపించకుండా పోతున్నారు. అందులో 10 వేల మందికి పైగా శాశ్వతంగా ఆచూకీ దొరకకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ్బెంగాల్, తమిళనాడు, కర్ణాటక మానవ అక్రమ రవాణాలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల వేర్వేరు గణాంకాలు ఇంకా లభ్యం కానప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. పోలీసులు ఉమెన్ ట్రాఫికింగ్ ను అరికట్టాలంటూ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులపై ఒత్తిడి ఉంది.